ఏపీకి మోడీ వ‌రాలు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించింది. శ‌నివారం జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సుదీర్ఘ కాలంగా ఏపీ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం కూడా ఎదురు చూస్తున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించింది. దీనిలో ప్ర‌ధానంగా రాజ‌మండ్రి-విశాఖ‌ల మ‌ధ్య రెండు రైల్వే లైన్ల‌ను నిర్మించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అలాగే.. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల మ‌ధ్య ఉన్న నిడ‌ద‌వోలు-దువ్వాడల‌ను క‌లుపుతూ.. మ‌రో రైల్వే లైన్‌ను నిర్మించేందుకు కూడా కేంద్ర మంత్రివ‌ర్గం ప‌చ్చ‌జెండా ఊపింది.

ఈ రెండు ప్రాజెక్టులు కూడా పెరుగుతున్న ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల‌కు అందిరానున్నాయి. అదేస‌మ‌యంలో రాష్ట్రానికి కూడా ఆదాయం పెర‌గ‌నుంది. వీటి ద్వారా .. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాలు.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల‌కు కూడా రైల్వే క‌నెక్టివిటీ పెరుగుతుంది. త‌ద్వారా.. ప్ర‌స్తుతం ఇబ్బందులు ప‌డుతున్న రైలు ప్ర‌యాణికుల‌కు కూడా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. ఈ ప్రాజెక్టుల‌కు సంబంధించి సుమారు 10 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించ‌నుంది. దీనిలో రైల్వే శాఖ 90 శాతం నిధులు ఇస్తుండ‌గా.. రాష్ట్ర ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ‌తోపాటు.. 10 శాతం నిధుల‌ను కేటాయించాల్సి ఉంటుంది.

ఇక‌, రెండోది..  పోర్టు క‌నెక్టివిటీ..

విశాఖప‌ట్నం-గంగ‌వ‌రం-మ‌చిలీప‌ట్నం-కాకినాడ పోర్టుల మ‌ధ్య అనుసంధాన ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్ర‌భుత్వం అంగీకారం తెలిపింది. 2014 నుంచి ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఎదురు చూస్తోంది. ఈ మార్గం ఏర్పాటుతో అత్యంత ర‌ద్దీగా ఉండే.. స‌రుకు ర‌వాణాకు మార్గం సుల‌భ‌త‌రం అవుతుంది. అంతేకాదు.. కోస్తా ప్రాంతానికి కూడా ఇది అందుబాటులోకి రానుంది. అలానే ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి క‌నెక్టివిటీ పెరుగుతుంద‌ని కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టు పూర్త‌య్యేలోగా ఈ ప్రాంతంలో ప‌రిశ్ర‌మల ఏర్పాటు కూడా పుంజుకోనుంది. దీనిలో భాగంగా గోదావ‌రి న‌డిపై సుమారు 4 కిలో మీట‌ర్ల మేర‌కు కొత్త‌గా రైలు వంతెన‌ను నిర్మిస్తారు. దీనికి అనుసంధానంగా రోడ్డు ప్రాజెక్టు కూడా రానుంది.

చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌త‌లు..

ఏపీ ప్ర‌జ‌లు సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డం.. నిధులు కూడా కేటాయించ డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇది రాష్ట్ర ఎంపీలుసాధించిన విజ‌యంగా పేర్కొన్నారు. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు ఉన్నందుకే.. ఇది సాకారం అయింద‌ని పేర్కొన్నారు. కేంద్రం అన్ని విధాలా రాష్ట్రానికి స‌హ‌కారం అందిస్తోంద‌ని చెప్ప‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల రాక‌తో విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-2047 ల‌క్ష్యాలు సాకారం అవుతాయ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.