వరుసబెట్టి మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమికి శుక్రవారం గట్టి షాకే తగిలింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఏళ్ల తరబడి సాగుతున్న ప్రక్రియ. అదే సమయంలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన అంశం నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండింటినీ ఒకేసారి అమలు చేయాలని బీజేపీ కీలక నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తలచింది.
వరుసగా మూడు పర్యాయాలు అధికారం దక్కించుకున్న తనకు ఇదేమీ పెద్ద పనే కాదని ఆ కూటమి తలచింది. అనుకున్నదే తడవుగా విపక్షాలతో నిర్మాణాత్మకమైన చర్చ లేకుండానే ఆ బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చి బొక్క బోర్లా పడిపోయింది. ఈ విషయంలో బీజేపీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్లనే ఎన్డీఏ కూటమికి పరాభవం తప్పలేదని చెప్పాలి.
వాస్తవానికి మహిళా బిల్లుకు 2023లోనే పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. అదే బిల్లును అమలు చేసి ఉంటే… ఎన్డీఏకు ఎలాంటి చిక్కు వచ్చేది కాదు. అదే సమయంలో డీలిమిటేషన్ విషయంలోనూ విపక్షాల మాటలకు సరేనని చెప్పిన ఎన్డీఏ… వ్యూహ రచనలో తప్పటడుగులు వేసింది. ఫలితంగా మహిళా బిల్లుతో పాటుగా డీలిమిటేషన్ బిల్లు కూడా ఎన్డీఏకు ఎదురు తన్నాయి. మోదీ అండ్ కో వ్యవహరించిన తీరుతోనే ఈ తరహా పరాభవం ఎదురైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తొలుత నారీ శక్తి వందనం పేరిట ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయానికి వస్తే… 2023లోనే ఇదే తరహాలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అంటూ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆ బిల్లును ఇప్పటికే అమలు చేసి ఉంటే సరిపోయేది. అయితే 2023లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఎన్డీఏ సర్కారు,… తాజాగా ప్రవేశపెడుతున్నట్లుగా ఫోజు కొట్టింది.
అయితే చివరి క్షణంలో విపక్షాల నుంచి వ్యతిరేకత తప్పదని గ్రహించిన ఎన్డీఏ.. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లును అమలులోకి తీసుకువస్తున్నట్లుగా శుక్రవారం ఓ గెజిట్ ను విడుదల చేసింది. అది కూడా గురువారం నుంచే మహిళా కోటాను అమలులోకి తీసుకువస్తున్నట్లుగా సదరు గెజిట్ లో ప్రకటించింది.
రెండు బిల్లులపై జరిగిన చర్చలో తనదైన శైలి సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ… మహిళా బిల్లును కొత్తగా సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరమేమిటని సూటిగానే ప్రశ్నించారు. అంతేకాకుండా 2023లో పార్లమెంటు ఆమోదించిన బిల్లును యథాతథంగా అమలు చేస్తే సరిపోయేది కదా అని కూడా ఆయన అధికార పక్షాన్ని నిలదీశారు.
ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా బిల్లును మరోమారు సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన రాహుల్.. ఇదంతా చూస్తుంటే మహిళలకు కోటాను అమలు చేసే ఉద్దేశం ఎన్డీఏకు లేదని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.. ఫలితంగా మహిళా బిల్లుకు మద్దతు పలుకుదామన్న పార్టీల మనసునూ ఆయన ప్రభావితం చేశారు.
ఇక ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లోక్ సభ నియోజకవర్గాలకు 50 శాతం సీట్టను అదనంగా పెంచుతామని ప్రకటించిన ఎన్డీఏ సర్కారు… అందులో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదని వాదించింది. ఇదే విషయాన్ని ప్రస్తాబించిన రాహుల్… అలాగైతే ఆ విషయాన్ని బిల్లులో పొందుపరచాలని, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఈశాన్య రాష్ట్రాలూ తీవ్రమైన అన్యాయానికి గురవుతాయని అన్నారు.
ఈ డిమాండ్ కూ సరేనన్న ఎన్డీఏ… దానిని అమలు చేయడంలో ఆసక్తి చూపలేదు. డీలిమిటేషన్ తో మహిళా బిల్లుును ముడిపెడతారేమిటన్న రాహుల్ ప్రశ్నకు ఎన్డీఏ కూటమి నుంచి సరైన సమాధానమే రాలేదు. వెరసి ఎన్డీఏ కూటమి ఓ స్పష్టమైన వ్యూహం లేకుండా బరిలోకి దిగి బిల్లులను నెగ్గించుకోలేక చతికిలబడిపోయిందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates