నియోజకవర్గాల పునర్విభజన వేళ… దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… దక్షిణాది రాష్ట్రాలు తీరని అన్యాయానికి గురి కావడం ఖాయమని, అదే జరిగితే… కేంద్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వానికి అయినా దక్షిణాది రాష్ట్రాల ఎంపీల అవసరం ఎంతమాత్రం ఉండదని, ఫలితంగా దక్షిణాది రాష్టాలకు నిధుల విడుదలలో కూడా అన్యాయం జరిగి తీరుతుందని ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు, వాటి నేతలు భావిస్తున్నారు.
తాజాగా దక్షిణాది రాష్ట్రాల తరఫున కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ మఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గళం విప్పారు. దక్షిణాదికి చెందిన మిగిలిన రాష్ట్రాల నేతలను కలుపుకుని కేంద్రంపై పోరాటం చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మాట నిజమేనన్నట్లుగా పునర్విభజన బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చేందుకు సమయం ఆసన్నమైన వేళ… రేవంత్ తన గళాన్ని మరింత బిగ్గరగా వినిపిస్తున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల తరఫున రేవంత్ వినిపిస్తున్న గళం బలమెంత అన్న ప్రశ్న అప్పుడే పెద్ద చర్చకే తెరలేపింది.
దక్షిణాది రాష్ట్రాల జాబితాలో రేవంత్ పాలనలోని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇక తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే అధికారంలో ఉంది. ఏపీలో బీజేపీ, జనసేనలతో కలిసి టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో లెఫ్ట్ ప్రభుత్వం ఉంది.
తెలంగాణ ఎలాగూ రేవంత్ పాలనలోనే ఉంది కాబట్టి… ఆ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలు కూడా రేవంత్ వాదనకు చేదోడు వాదోడుగా నిలవనున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల తరఫున ఈ పోరాటాన్ని ప్రారంభించిన నేతగా డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. రేవంత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఖాయమే.
కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు కూడా రేవంత్ వాదనకు వంత పాడనుంది. తమిళనాడు, కర్ణాటకలు ఓ మోస్తరు ప్రాంతీయ వాదానికి మద్దతు పలికే రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో వేరే పార్టీ ప్రభుత్వాలు ఉన్నా… దక్షిణాదికి అన్యాయం అంటే బస్తీమే సవాల్ అంటూ రేవంత్ కు వెన్నుదన్నుగా నిలిచేవి.
ఇక ఏపీ విషయానికి వస్తే… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో రేవంత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ నేతగా రేవంత్ ఎదిగింది టీడీపీలోనే కదా. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయాక టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలను అనుసరించి ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
మరి ఇప్పుడు రేవంత్ దక్షిణాది గళానికి టీడీపీ మద్దతు పలుకుతుందా? అంటే… అనుమానమేనని చెప్పాలి. ఎందకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ రథసారథి బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్యం కలిగిన టీడీపీ… తన కేబినెట్ లో జనసేనతో పాటు బీజేపీకీ భాగస్వామ్యం ఇచ్చింది. ఫలితంగా రేవంత్ వాదనకు బహిరంగంగా టీడీపీ గానీ, జనసేన గానీ పోరులోకి దిగే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. అటు వైసీపీ స్టాండ్ పై కూడా విభిన్న ఊహాగానాలు నడుస్తున్నాయి.
ఇక కేరళ విషయానికి వస్తే… కేరళలోని అదికార యూడీఎఫ్ కూటమి అటు బీజేపీతో పాటుగా ఇటు కాంగ్రెస్ కు కూడా దూరంగానే సాగుతోంది. ప్రస్తుతం కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా… ఇదే తరహాలో యూడీఎఫ్ సాగుతోంది. ఇది యూడీఎఫ్ సిద్ధాంతమే అయినా… దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటే…యూడీఎఫ్ రథసారధి పినరయి విజయన్ ఇట్టే వచ్చి వాలేవారు.
అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ హోదాలో కేరళ వెళ్లిన రేవంత్… విజయన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశార. యూడీఎఫ్ ను గద్దె దించాలని ఆయన కేరళ ఓటర్లకు పిలుపునిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలతో విజయన్ బాగానే ఇబ్బంది పడ్డారని చెప్పాలి. ఈ నేపధ్యంలో రేవంత్ దక్షిణాది గళానికి విజయన్ మద్దతు పలకకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
