తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క సోమవారం ఓ కీలక చర్య చేపట్టారు. రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చర్యలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆమె లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లోగా తనకు సారీ చెప్పాలని, లేదంటే కేసీఆర్ పై క్రిమినల్ చర్యలకూ వెనుకాడబోనని ఆమె సదరు నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేశారు.
అయినా కేసీఆర్ కు సీతక్క నోటీసులు పంపడానికి గల కారణాలేమిటన్న విషయానికి వస్తే… తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రంల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇటీవలే ప్రభుత్వం సెల్ ఫోన్ లను అందజేసింది. ఈ ఫోన్ల పంపిణీని ఇటీవలే సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ ఆసక్తికర పోస్టులు కనిపించాయి. కేవలం రూ.6,500లకు లభించే సోల్ ఫోన్ కోసం ప్రభుత్వం ఏకంగా రూ.11 వేలకు పైగా ఖర్చు చేసిందని సదరు పోస్టులు ఆరోపించారు.
బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో కనిపించిన ఈ పోస్టులు చూసిన వెంటనే సీతక్క ఆగ్రహంతో ఊగిపోయారని చెప్పాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తే… ఆ బాధ్యత కేసీఆర్ దేనని ఆమె భావించారు. అనుకున్నదే తడవుగా కేసీఆర్ కు లీగల్ నోటీసులు సిద్ధం చేసిన సీతక్క… కేసీఆర్ కు వార్నింగులిచ్చారు.
48 గంటల్లోగా సోషల్ మీడియాలోని సదరు పోస్టులను తొలగించడంతో పాటుగా కేసీఆర్ బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ పై క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చారు. మరి కేసీఆర్ దిగివస్తారో, లేదంటే సీతక్క ఆయనపై ఏ తరహా క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates