అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు… రావు. ఎన్నిక‌ల వేళ మాత్రం అన్నీ దొంత‌ర‌లు దొంత‌ర‌లుగా గుర్తుకు వస్తుంటాయి. అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌క్క‌నే ఉన్న‌వారి యోగ‌క్షేమాలు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, ఎన్నిక‌లు అనగానే.. ఎక్క‌డాలేని ఆప్యాయ‌త కురిపించేస్తారు. – ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో జ‌నాలు.. ఆయా సంద‌ర్భాల్లో చేసిన వ్యాఖ్యలే!.

ఇటీవ‌ల కాలంలో మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లకు ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా పోలిక ఉందనేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. ముఖ్యంగా మూడు అంశాలు.. ప్ర‌ధాని మోడీకి ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే గుర్తుకు రావ‌డం విశేషం.

1) మ‌హిళా రిజ‌ర్వేష‌న్ క‌ల్ప‌న: వాస్త‌వానికి ఈ వ్య‌వ‌హారం.. గ‌త ఏడాదే బిల్లుగా వ‌చ్చింది. అనంత‌రం చ‌ట్ట రూపంలోకి కూడా మారింది. 2034 త‌ర్వాత నుంచి దేశ‌వ్యాప్తంగా అమ‌లు కానుంది. కానీ, ఇటీవ‌ల ఈనెల 9న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ఈ విష‌యంపై భారీ ఎత్తున ఊద‌ర గొట్టారు. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ అవ‌స‌ర‌మ‌ని.. వారికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. పేర్కొం టూ.. దేశంలో ఎన్ని భాష‌లు ఉంటే అన్ని భాష‌ల్లోనూ ఆయ‌న ప‌త్రిక‌ల‌కు వ్యాసాలు రాశారు.

అంతేకాదు.. మీడియాలో బైట్లు ఇచ్చారు. సెల్ఫీ వీడియోను కూడా విడుద‌ల చేశారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ క‌ల్ప‌న‌కు తామిస్తున్న ప్రాధాన్యాన్ని వివ‌రించారు. ఈ నెల 16 -18 మ‌ధ్య అందుకే పార్లమెంటును భేటీ ప‌రుస్తున్నామ‌ని కూడా చెప్పుకొచ్చారు. నిజానికి ఆ స‌మ‌యంలో అస్సాం, పుదుచ్చేరి, కేర‌ళ‌లో ప్ర‌జ‌లు ఓట్లు వేస్తున్నారు. కానీ.. మోడీకి ఇప్పుడే ఆ రిజ‌ర్వేష‌న్‌పై `ప్ర‌చారం` చేసుకోవాల‌ని అనిపించింది.

2) సోనియా: కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు.. రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ ఇటీవ‌ల అస్వ‌స్థత‌కు గుర‌య్యారు. వైద్య ప‌రీక్ష‌ల‌ అనంత‌రం.. ఇంటికి చేరుకున్నారు. ఈ విష‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రికీ తెలుసు. కానీ.. ప్ర‌ధాని మోడీకి మాత్రం చాలా ఆల‌స్యంగా గుర్తుకు వ‌చ్చింది. అది కూడా.. ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో మీడియా ముందు ఆయ‌న‌కు గుర్తుకు రావడం విశేషం.

సోనియా ఆరోగ్యం గురించి.. జ్యోతిబా ఫూలే జ‌యంతి కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానికి గుర్తుకువ‌చ్చింది. ఆ వెంట‌నే.. ఆయ‌న ముందుకు వెళ్తూ.. వెళ్తూ.. కూడా వెన‌క్కి తిరిగి.. వ‌రుసులో ఉన్న రాహుల్‌గాంధీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. ప‌రామ‌ర్శిస్తారు… సోనియాగాంధీ ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు చెబుతారు. ప‌రామ‌ర్శించ‌డం.. సోనియా ఆరోగ్యాన్ని వాక‌బు చేయ‌డం త‌ప్ప‌ని ఎవ‌రూ అన‌రు.. కానీ, `స‌మ‌యం-సంద‌ర్భ‌మే` ప్ర‌స్తావ‌నార్హం!.. త‌ద్వారా.. కాంగ్రెస్ విధేయుల‌కు సైతం మోడీ మెచ్చుకోలు నాయ‌కుడిగా మారిపోవ‌డే పాలిటిక్స్‌.

3) అయోధ్య‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రామ‌జ‌న్మ‌భూమిలో అయోధ్య బాల‌రామ‌య్య విగ్ర‌హ ప్ర‌తిష్ఠాప‌న‌, ధ్వ‌జా రోహణం, ఇటీవ‌ల మంత్ర‌ప్ర‌తిష్టాప‌న వంటి కార్య‌క్ర‌మాలు ముగిశాయి. అయితే.. చిత్రం ఏంటంటే.. ఈ ప‌నుల‌న్నీ ముగిసిన‌ట్టు.. గ‌త నెల‌లోనే.. అయోధ్య రామ‌మందిర ట్ర‌స్టు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. కానీ.. అలా అయిపోయింద‌నిపిస్తే.. ఇప్పుడు ప్ర‌యోజ‌నం ఏముంటుంది? అనుకున్నారో ఏమో.. తాజాగా “అయోధ్య రామాల‌యంలో అన్ని ప‌నులూ పూర్త‌య్యాయ‌హో..“ అంటూ.. రామ‌జ‌న్మ‌భూమి తీర్థ ట్ర‌స్టు ప్ర‌క‌టించింది.

అంతేకాదు.. దీనిని పుర‌స్క‌రించుకుని ఓ 10 రోజుల పాటు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలుకూడా నిర్వ‌హిస్తార‌ట‌. వాస్త‌వానికి ఈ ప్ర‌క‌ట‌న చేసి నెల రోజులయింది. కానీ, ఇప్పుడు మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు గుర్తు చేయ‌డంలోను `ప్ర‌త్యేక‌` కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించడంలోనూ ఉన్న ఆంత‌ర్య‌మే.. గుర్తుచేసుకోవాలి!.

అంతేనా.. దీనిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని మోడీ మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న గ‌ళం వినిపించారు. ఏదేమైనా.. ఈ మూడు అంశాలు కూడా.. ఇప్పుడు గుర్తుకు రావ‌డం.. గుర్తు చేసుకోవ‌డం.. ప్ర‌జ‌ల‌కు గుర్తు చేయ‌డం వంటివి.. ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇందులో ఉన్న గ‌మ్మత్తేంటంటే.. ఇవేవీ ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం కాక‌పోవ‌డం. ఇదేస‌మ‌యంలో మెజారిటీ ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌స్థాయిలో ప్ర‌భావితం చేయ‌డం!!. ఇది క‌దా.. రాజ‌కీయం అంటే!!.