జ‌గ‌న్ డ‌బ్బును చూస్తే.. బాబు భ‌విష్య‌త్తు చూస్తున్నారు..!

సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది “డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.“ అని. ఇక‌, భవిష్యత్తును ఊహించుకుని ఒక సాధారణ ఆటో కార్మికుడు కూడా తన పిల్లలను ఉన్నత స్థాయి విద్యను చదివించాలని భావిస్తాడు. దీనికి కారణం అతని దగ్గర డబ్బు ఎక్కువ ఉండి కాదు.. ఇప్పుడు కష్టపడినా భవిష్యత్తులో పిల్లలు ఎదుగుతారు… భవిష్యత్తులో పిల్లల జీవితం బాగుంటుంది అనే ఒక దూరదృష్టి. ఒక విస్తృతమైన ఆలోచన.

మరి చిన్న చిన్న కుటుంబాలకే ఈ స్థాయిలో ప్రణాళికలు ఉంటే.. రాష్ట్రానికి ప్రయోజనాలను కల్పించే రాజధాని విషయంలో మరి ఇంకెన్ని ప్రణాళికలు ఉండాలి?. ఇంకా ఎంత దూర దృష్టితో వ్యవహరించాలి?. ఇదే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ఆలోచన. జగన్ ఆలోచనకి చంద్రబాబు ఆలోచనకి మధ్య ఉన్న ఏకైక తేడా. అదే సమయంలో భవిష్యత్తు మీద అంచనాలు. రాజధాని నిర్మాణానికి రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి కాబట్టి అమరావతి పూర్తి కాదని అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని వైసిపి చెబుతోంది.

కానీ వాస్తవం ఏంటి? ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా.. అది నిరంతర ప్రక్రియ. ఒక దగ్గర ఆగిపోయేది, ఒక దగ్గర నిలిచిపోయేది కాదు. మనం ఒక ఇల్లు కొనుక్కుంటే ముందుగా కొద్దిపాటి ఫర్నిచర్ తో అందులోకి దిగుతాం. కొన్నాళ్లు గడిచిన తర్వాత ఆ ఇంటినే మరింతగా ఫర్నిచర్ తో నింపటమా.. లేకపోతే మరిన్ని రంగులతో దాన్ని ముస్తాబు చేయటం అనేది చేస్తాం. ఎందుకంటే అదొక భవిష్యత్తు ప్రణాళిక కాబట్టి. అంతేకానీ జగన్ ఆలోచన విధానం చూస్తే డబ్బులు ఉన్నప్పుడే రాజధాని కట్టాలి అంటే అది అయ్యే పని కాదు.

అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేవాళ్ళు కూడా చేతిలో రెండు లక్షలు మూడు లక్షలుతో 40 లక్షల రూపాయలు అప్పు చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఉంది. మరి అలాంటివాడు 40 లక్షల రూపాయలు పోగు చేసిన తర్వాతే ఇల్లు కొనాలి అంటే సాధ్యమవుతుందా అంటే అవ్వదు. రాజధాని కూడా అంతే. ముందు ప్రాథమికంగా కొంతమేరకట్టుకుంటాం.. ఆ తర్వాత నెమ్మదిగా మౌలిక సదుపాయాలు పెంచుకుని విస్తరించుకుంటూ వెళ్తాం. ఇది నిరంతర ప్రక్రియ.

వాస్తవానికి ఒక వ్యక్తి జీవితంలోనే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అయినప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనాన్ని.. దాదాపు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అమరావతి రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియగా ఎందుకు ఉండకూడదు…?! కచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ ను ఉదాహరణగా తీసుకుంటే ఇప్పటికీ అక్కడ అభివృద్ధి జరుగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అని ఔటర్ రింగ్ రోడ్డు అని శంషాబాద్ అని ఏదో ఒక రూపంలో అభివృద్ధి జరుగుతోంది కదా. మెట్రో వచ్చింది ఇంకా వస్తోంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు.

డబ్బు ప్రధానం కాదు. డబ్బు ఈ రోజు లేకపోవచ్చు కానీ కొన్నాళ్ళకి డబ్బు రావచ్చు అప్పుడు మళ్ళీ రాజధాని కట్టాలి అంటే అప్పుడు రాజధాని కోసం భూములు సమీకరించాలంటే అప్పుడు ప్రణాళికలు వేయాలంటే సాధ్యమవుతుందా?!. ఆలోచన విధానంలోనే మెరుగైన‌ ఆలోచన ఉండాలి. విస్తృతమైన పరిధి ఉండాలి. భవిష్యత్తు మీద నిర్దేశం ఉండాలి.

రాజకీయంగానే కాదు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే అమరావతి నిరంతర ప్రక్రియ అనడంలో ఎటువంటి తప్పు లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. జగన్ కేవలం డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు.. చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నారు.. ఇద్దరి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది.