ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. తిరుపతిలోని కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి సైలెంట్గా చుట్టేస్తున్నారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి ఆమె అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత జనవరిలోనే కుప్పంలో పర్యటించిన ఆమె.. తాజాగా గత మూడు రోజులుగా ఇదే నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇలా పర్యటించడం తప్పుకాకపోయినా.. గతానికి భిన్నంగా ఆమె ఇంత ప్రాధాన్యం ఇవ్వడమే చర్చనీయాంశం అయింది.
అందరినీ కలుపుకొని..
కుప్పం నియోజకవర్గానికి తరచుగా వస్తున్న భువనేశ్వరి.. అందరినీ కలుపుకొని పోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ కలివిడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్త నుంచి అభిమాని వరకు ఎవరి ఇంట్లో ఏ శుభకారం జరిగినా.. ఆమె హాజరవుతున్నారు. రిబ్బన్ కట్ చేస్తున్నారు. అంతేకాదు సమస్యల్లో ఉన్న కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారు. ఇటీవల ఓ కార్యకర్త మృతి చెందితే.. ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఆ కార్యకర్త పిల్లలను చేర్చారు.
అన్నీ తానై..
కుప్పం ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు కూడా తరచుగా వస్తున్నప్పటికీ.. రాష్ట్రసమస్యలు, పెట్టుబడులు , పాలన వంటి కీలక అంశాల్లో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో కుప్పంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు పెద్దగా తీరిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా పనులను నారా భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా సూచనలు, సలహాలు అవసరమైనా ఇస్తున్నారు. అలాగని ఆమె పరిధులు దాటి ఎప్పుడూ వ్యవహరించకపోవడం గమనార్హం.
వైసీపీకి చెక్!
మరోవైపు.. కుప్పంలో వైసీపీ పుంజుకునేందుకు 2023 నుంచి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాజకీయంగా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు.. నాయకులకు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చింది. కానీ.. గత ఎన్నికల్లో చంద్రబాబు వరుస విజయం దక్కించుకున్నారు. ఇక, గత ఎన్నికల తర్వాత.. కుప్పంలో వైసీపీ ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. వైసీపీ కార్యాలయాన్ని కూడా మూసేశారు. మరోవైపు.. భువనేశ్వరి సహా సీఎం చంద్రబాబు యాక్టివ్గా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో వైసీపీ పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని పక్కన పెట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates