నిప్పులు కురిపించిన ‘ఇందిరమ్మ ఇప్ప‌సారా`

తెలంగాణ అసెంబ్లీలో బుధ‌వారం దాదాపు ఒకే అంశంపై అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగింది. దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళంతోపాటు.. బీజేపీ-కాంగ్రెస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాట‌ల మంట‌లు రేగాయి. ఇదంతా.. `ఇప్ప‌సారా` వ్య‌వ‌హారమే కావ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌పై తాజాగా స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో బీజేపీ స‌భ్యుడు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒకానొక సంద‌ర్భం గా రాకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు సమ‌ర్థించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

“రాష్ట్రంలో చాలా ప‌థ‌కాల‌కు ఇందిర‌మ్మ పేరు పెడుతున్నారు. అయితే.. నా మ‌న‌వి ఏంటంటే అధ్య‌క్షా.. ఇప్ప‌సారాకు మాత్రం.. ఇందిర‌మ్మ ఇప్ప‌సారా అని మాత్రం పేరు పెట్టొద్ద‌ని సూచిస్తున్నా“ అని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లే.. అసెంబ్లీలో తీవ్ర క‌ల‌క‌లం రేపాయి.

ఈ వ్యాఖ్య‌ల‌పై అధికార పార్టీ స‌భ్యులు, మంత్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాకేష్ రెడ్డి త‌న వ్యాఖ్య‌ల ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అలాగే.. రాకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి కూడా తొల‌గించాల‌ని స్పీక‌ర్‌ను కోరారు.

ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్న రాకేష్ రెడ్డి.. తానేమీ త‌ప్పుగా మాట్లాడ‌లేద‌ని.. అనేక ప‌థ‌కాల‌కు ఇందిర‌మ్మ పేరు పెడుతున్నార‌ని.. ఈ క్ర‌మంలో ఇప్ప‌సారా ప‌థ‌కానికి కూడా ఆమె పేరు పెడ‌తారేమోన‌ని భావించే ఈవ్యాఖ్య‌లు చేశాన‌న్నారు.

ఇందిరమ్మపై త‌న‌కు ఎంతో అభిమానం ఉంద‌న్నారు. ఉక్కుమ‌హిళ‌గా ఆమెను గౌర‌విస్తాన‌ని చెప్పారు. అంతేకాదు.. తాను త‌ప్పు మాట్లాడ‌లేద‌న్నారు. ఒక‌వేళ త‌ప్ప‌ని నిరూపిస్తే క్ష‌మాప‌ణ‌లు చెబుతాన‌ని తెలిపారు. “ఇప్ప‌సారా ప‌థ‌కం తెస్తున్నారు. దీనికి ఇందిర‌మ్మ పేరు పెడ‌తార‌ని తెలిసింది. అందుకే ఇలా సూచించాను.“ అని అన్నారు.

హ‌రీష్‌రావు మ‌ద్ద‌తు..
వాస్త‌వానికి బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించే బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్‌రావు.. తాజాగా అదే పార్టీకి చెందిన రాకేష్ రెడ్డికి మ‌ద్ద‌తుగా మాట్లాడారు. రాకేష్ రెడ్డిచేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టుకుని అధికార పార్టీ గింజుకుంటోంద‌ని.. స‌భా స‌మ‌యాన్ని వృథా చేస్తోంద‌ని అన్నారు.

అంతేకాదు.. గ‌తంలో కేసీఆర్‌నుకాంగ్రెస్ నాయ‌కులు అనలేదా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటిపై చ‌ర్చించాల‌ని సూచించారు. గ‌తంలో కేసీఆర్‌పైనా కాంగ్రెస్ నేత‌లు ఇలానే వ్యాఖ్యానించార‌ని చెప్పారు. మొత్తంగా బుధ‌వారం అసెంబ్లీలో మెజారిటీ స‌మ‌యం ఇప్ప‌సారా వివాదంపైనే సాగ‌డం గ‌మ‌నార్హం.