ఔను.. నిజమే! ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. మరో రెండు మూడు రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే కేరళలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చడీ చప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ప్రచారం, స్టార్ క్యాంపెయినర్ల సందడి కనిపించేది. కానీ ఈసారి అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.
ఈ దఫా రాష్ట్రాల నాయకులే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసోంలో పొత్తులు కుదరకపోవడం పెద్ద సమస్యగా మారింది. బలమైన సీఎం, బీజేపీ నాయకుడు హిమంత బిశ్వ శర్మను ఎదుర్కొనే వ్యూహాలు కాంగ్రెస్కు స్పష్టంగా కనిపించడం లేదు.
తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకున్నా ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు. 240 స్థానాల్లో కాంగ్రెస్కు కేవలం 36 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో స్థానిక నాయకులే ప్రచార బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ సీట్లను రాజ్యసభ కోసం త్యాగం చేశారన్న విమర్శలకు కాంగ్రెస్ అధిష్టానం సమాధానం ఇవ్వలేకపోతోంది.
బెంగాల్లో కూడా పరిస్థితి స్పష్టంగా లేదు. గతంలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి పొత్తులపై క్లారిటీ లేక సీట్ల విషయంలో నిలకడ సాధించలేకపోతోంది. ఇదే సమయంలో బీజేపీ ఇప్పటికే ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బెంగాల్లో ప్రధాన పోటీ బీజేపీ, మమతా బెనర్జీ మధ్యే కేంద్రీకృతమవుతోంది.
కేరళలో కూడా కాంగ్రెస్ పరిస్థితి సవాళ్లతో నిండిపోయింది. పైకి నేతలు 100 సీట్లు గెలుస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఐక్యత లోపం కనిపిస్తోంది. మరోవైపు సీఎం పినరాయి విజయన్కు ప్రజల్లో మద్దతు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్, డీఎంకే మధ్య సమన్వయం బలంగా కనిపించడం లేదు. ఇక్కడ కూడా బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రీ పోల్స్ సూచిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీకి బలంగా ఉండాల్సిన రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించకపోవడం శ్రేణుల్లో నిరాశను పెంచుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates