బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో విదేశీ సంస్థ కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు.. ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపీకి త‌ర‌లి వ‌స్తున్నామ‌ని తెలిపింది. ఇది త‌మ‌కు ల‌భించిన గొప్ప అవ‌కాశంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అమెరికా-జ‌పాన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన `ప్రొటీరియ‌ల్‌` సంస్థ ఏపీలో `మెట్ గ్లాస్ ఇండియా` పేరుతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ సంస్థ అల్లాయ్ రిబ్బ‌న్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. 77 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబడిగా పెట్ట‌నున్న ఈ సంస్థ‌.. తిరుప‌తి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం శ్రీసిటీలో త‌న విభాగాన్ని ఏర్పాటు చేయ‌నుంది. దీనికి సంబంధించి గ‌త ఏడాదే ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందం మేర‌కు తొలి రెండేళ్ల‌పాటు ప‌న్నులు మిన‌హాయిస్తారు. స్థానికంగా ఉన్న యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల్సి ఉంటుంది.

శ్రీసిటీలో ఈ సంస్థ `ఎలక్ట్రికల్‌ స్టీల్‌ సిటీ` కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దీని నుంచి ఉత్ప‌త్తి అయ్యే అల్లాయ్ రిబ్బ‌న్ల‌ను దేశ‌, విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌నున్నారు. ప్ర‌ధాన వ్యాపారం అంతా విదేశాల కేంద్రంగానే సాగ‌నుంది. మొత్తం తొలిద‌శ‌లో 200 మంది స్థానికుల‌కు ఉద్యోగాలు, ఉపాధి క‌ల్పించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అధునాతన జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్లాంట్‌లో వినియోగించ‌నున్నారు.

ఇదిలావుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డుల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇవి ఒక్కొక్క‌టిగా త‌మ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వాటికి వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయిస్తున్నారు. అదేవిధంగా ప‌లు రాయితీలు కూడా ప్ర‌క‌టిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా అమెరికా-జ‌పాన్ సంయుక్త సంస్థ ఏపీకి రావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది మెజారిటీ ఒప్పంద సంస్థ‌లు ఏపీలో త‌మ త‌మ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నాయ‌ని ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించారు.