తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ నెయ్యి తయారీలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు అన్నారు. తాజాగా సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, ఆ రోజు చంద్రబాబు చెప్పింది అబద్ధమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ విషయంపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబు క్లారిటీనిచ్చారు.
2024 జులై 23న ఎన్ డీడీబీ రిపోర్ట్ వచ్చిందని, యానిమల్ ఫ్యాట్ ఉందని ఆ రిపోర్ట్ లో ఉందని, ఆ రిపోర్ట్ ప్రకారమే ఆ విషయాన్ని తాను చెప్పానని స్పష్టం చేశారు. అది తాను సొంతంగా ఇచ్చిన స్టేట్మెంట్ కాదని క్లారిటీనిచ్చారు.
ఇక, జీవో నెంబర్ 746, 747లను తాను రద్దు చేస్తానని చెప్పిన వీడియోపై కూడా చంద్రబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుపతిలో ఏడుకొండలు కాదు.. రెండు కొండలు అని జీవో ఇచ్చారని, దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేశానని గుర్తు చేశారు.
రెండేళ్ల తర్వాత ఆ జీవోపై వెనక్కి తగ్గారని అన్నారు. తప్పు చేసింది వాళ్ళేనని, తనపై దుష్ప్రచారం చేస్తుంది కూడా వాళ్ళేనని మండిపడ్డారు. కలలో కూడా ఏడుకొండలపై తప్పుగా మాట్లాడలేదని అన్నారు. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే.. ఈ జన్మలో శిక్ష అనుభవిస్తారని చెప్పారు.
టీటీడీ మాజీ చైర్మన్ లు వైవీ సుబ్బారెడ్డి, భూమన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ క్షమాపణలు చెప్పాల్సిందిపోయి, ఏమీ జరగలేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆలయాలకు హెరిటేజ్ పాలు, నెయ్యి సరఫరా చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని, హెరిటేజ్ ఎప్పుడూ తప్పు చేయలేదని ఇందాపూర్ ఇష్యూపై క్లారిటీనిచ్చారు. సాక్షికి వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చుకున్నారని, అయినా వాటి గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతని దెబ్బతీసేందుకు మొదటి నుంచి కుట్ర చేస్తూనే ఉన్నారని, జగన్ హయాంలో తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్ పై అన్యమత ప్రచారం చేశారని టికెట్లను అసెంబ్లీలోని స్క్రీన్ పై ప్రదర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates