ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు అధికారులపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదయ్యాయి. ఇలాంటి అధికారుల్లో అప్పటి సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఒకరు. ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్‌కు గురి చేశారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు.

ఈ వ్యవహారంతో ఆయనపై రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అదేసమయంలో నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం అంశాలపై కూడా ఏపీ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. దీంతో గతంలోనే ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా ఈ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సునీల్ రూల్స్‌కు విరుద్ధంగా పనిచేశారని పేర్కొంది.

ఈ నేపథ్యంలో అఖిల భారత సేవల డిసిప్లిన్ అండ్ అప్పీల్ నియమాలు 1969లోని రూల్ 3(3) ప్రకారం సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్‌పై ఉన్న క్రిమినల్ కేసు పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది 2026 జూన్ 30న సునీల్ కుమార్ రిటైర్మెంట్‌కు చేరుకోనున్నారు.

అప్పటి వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగనుంది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన క్రైమ్ నం. 187/2024 దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో సంబంధం ఉండటంతో సస్పెన్షన్‌ను పొడిగించినట్లు ప్రభుత్వం వివరించింది. అదేవిధంగా రఘురామపై టార్చర్ కేసులోనూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. మొత్తానికి రిటైర్మెంట్ వరకు సునీల్ సస్పెన్షన్‌లోనే ఉండనున్నారు.