“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2014లో పవన్ కల్యాణ్ రాజకీయాలను విమర్శిస్తూ ఆయన రాసిన పుస్తకం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ పై జనసేన కార్యకర్తలు కేసు పెట్టగా ఆయనను అరెస్టు కూడా చేశారు. దీంతో, ఈ హత్య వెనుక పవన్, జనసేన నేతల హస్తం ఉందంటూ కొన్ని మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం కూడా చేశాయి.
అయితే, అవన్నీ అసత్యాలని ఖమ్మం పోలీసులు తేల్చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే శ్రీనివాస్ ను ఆయన స్నేహితుడు వేణు మాధవ్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించాడని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించారు.
పవన్ పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ పేరు మీద ఉన్న జీఎస్టీని ఆయన మిత్రుడు వేణు మాధవ రెడ్డి వాడుకొని జీఎస్టీ కట్టలేదని, దీంతో, వేణు మాధవ రెడ్డిని శ్రీనివాస్ ఒత్తిడి చేశారని వెల్లడించారు.
ఆ క్రమంలోనే శ్రీనివాస్ అడ్డు తొలగించుకోవాలని వేణు పథకం వేశాడని తెలిపారు. కోటేశ్వరరావు, అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీలకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడని వెల్లడించారు. విజయవాడ వెళ్తుండగా నార్కెట్ పల్లి – నకిరేకల్ మధ్య శ్రీనివాస్ ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు.
పాలేరు రిజర్వాయర్లో మృతదేహం పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఈ కేసులో వేణుతో సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates