ఇక బాలయ్యకు అద్దె ఇళ్లు అవసరం లేదు

నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపురంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఆయన తన సతీమణి వసుంధర దేవితో కలిసి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. గత 12 ఏళ్లుగా హిందూపురానికి వచ్చిన ప్రతిసారీ అద్దె ఇంట్లోనే ఉంటూ వచ్చిన బాలకృష్ణ, నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుంటానన్న హామీని ఈ శంకుస్థాపనతో నెరవేర్చుతున్నారు.

హిందూపురం సమీపంలోని వనం కాలనీలో సర్వే నెంబర్ 445లో సుమారు 81 సెంట్ల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించనున్నారు. మూడు అంతస్తుల ఈ విలాసవంతమైన గృహంలో స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన పార్క్ వంటి ఆధునిక సదుపాయాలు ఉండనున్నట్లు సమాచారం.

ఇకపై ఈ సొంత నివాసం నుంచే నియోజకవర్గ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. స్థానికేతరుడని వస్తున్న విమర్శలకు ఈ నిర్ణయంతో గట్టి సమాధానం ఇచ్చినట్టుగా భావిస్తున్నారు.

ఇక తన రెండు రోజుల పర్యటనలో భాగంగా బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మనేంపల్లిలో రూ. 2.60 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి స్వయంగా ప్రొక్లెయిన్ నడిపి పనులను ప్రారంభించారు.

పులమతి చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. నియోజకవర్గంలోని చెరువులను హంద్రీనీవా నీటితో నింపినందుకు స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.