కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. “రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం“ అంటూ.. ఆయ‌న అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌.. ఇప్పుడు రాజ‌కీయ నినాదంగా మార‌నుంది. ప్ర‌స్తుతం మ‌ద్యం, సిగ‌రెట్లు వంటి వాటిపై.. `ఆరోగ్యానికి హానికరం` అని రాసి ఉంటుంది. ఇప్పుడు రాజ‌కీయంగా రాష్ట్రంలో వైసీపీ హానిక‌రం అనే నినాదం పెద్ద ఎత్తున వినిపించ‌నుంది.

గ‌తంలో టీడీపీ యువ‌నాయ‌కుడు.. మంత్రి నారా లోకేష్‌.. ఓ స‌భ‌లో జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. `సైకో` అని వ్యా ఖ్యానించారు. తొలుత ఆయ‌న ఈ వ్యాఖ్య చేయ‌డానికి త‌డ‌బ‌డినా.. కౌంట‌ర్ ఎలా ఉంటుందో అని అనుకున్నా.. త‌ర్వాత కాలంలో వైసీపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి, విరుచుకుప‌డ‌డానికి కూడా కూట‌మి నాయకుల‌కు `సైకో` ప‌దం బ్ర‌హ్మాస్త్రంగా ప‌నిచేసింది. ఇది ఎంత వ‌ర‌కు వెళ్లిందంటే.. వైసీపీ ప్ర‌భుత్వ బాధితులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం.. సైకో నినాదాలతో ఒక ద‌శ‌లో విజృంభించారు.

ఆ త‌ర్వాత‌.. బీజేపీ నాయ‌కురాలు.. ప్ర‌స్తుత ఎంపీ.. పురందేశ్వ‌రి జ‌గ‌న్ స‌ర్కారు చేసిన అప్పుల‌పై.. చేసిన ప్ర‌క‌ట‌న కూడా.. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు పెద్ద ఎత్తున మార్మోగింది. “జ‌గ‌న్‌.. 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పు చేశారం“టూ.. రాజ‌మండ్రిలో మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్య‌.. త‌ర్వాత కాలంలో టీడీపీ అంది పుచ్చుకుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున దీనిపై చ‌ర్చ జ‌రిగింది. ఇది కూడా జ‌గ‌న్ ప‌త‌నానికి దారి తీసేలా చేసింది.

ఇలా.. ప‌లు సంద‌ర్భాల్లో ఆయా పార్టీల నాయ‌కులు చేసిన కామెంట్లు.. త‌ర్వాత కాలంలో ఎన్నిక‌ల నినాదాలుగా మారాయి. అవి వైసీపీని తీవ్రంగా ఇరుకున ప‌డేశాయి. ఇప్పుడు ప‌య్యావుల చేసిన “రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం“ నినాదం కూడా అదే రేంజ్‌లో వైసీపీపై ప్ర‌భావం చూపించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ నడుస్తోంది.