ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ ప్రస్తుతం అనర్హత వేటు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యారు? కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నేతలు ఏకిపారేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చే కడియం వంటి నేతలకు కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని ఫైర్ అవుతున్నారు. కడియం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేస్తున్నారు.

అయితే కడియం ఇలా ఏరు దాటాక తెప్ప తగలేయడం మొదటి సారి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతగా ఓ వెలుగు వెలిగిన కడియం శ్రీహరి, తర్వాత తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి దాకా చంద్రబాబును పొగిడిన కడియం, ఆ తర్వాత ఆయనపైనే విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు వ్యతిరేకమని, ఇక్కడి ప్రాజెక్టులను ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించేవారు. టీడీపీలో తెలంగాణ నాయకులకు గుర్తింపు లేదని కూడా వ్యాఖ్యానించారు.

ఇలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే కడియం వంటి నేతలకు విశ్వసనీయత లేదనడంలో సందేహం లేదు. తమ అవసరాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అప్పటి దాకా పదవులు అనుభవించిన పార్టీని దుమ్మెత్తిపోసి, ఆ పార్టీ అధినేతలను విమర్శించడం వల్ల ఇలాంటి నేతలను ప్రజలు నమ్మరు.

13 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడారని ప్రశంసించిన నోటితోనే ఆయన తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన కడియం మాటలకు విలువ ఏముంటుంది? ఊసరవెల్లిలా రంగులు మార్చే ఇటువంటి నేతలు చివరకు మారడానికి పార్టీ కూడా మిగలదన్నది అక్షర సత్యం.