రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలసిందే. ఈ విషయం ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు తెలియదని అనుకునే పరిస్థితి లేదు. రాజకీయంగా ఆయనకు పదేళ్ల అనుభవమే ఉన్నా.. డక్కాముక్కీలు తిన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైసీపీ హయాం నుంచి ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే వరకు ఆయన అనేక రూపాల్లో రాజకీయాలు చూస్తున్నారు.
ప్రస్తుతం ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ కొందరికే పరిమితం అవుతున్నారన్నది.. ఆయనకు నచ్చకపోయినా వాస్తవమేనని అంటున్నారు టీడీపీ నాయకులు. అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఆయన విఫలమవుతున్నారని చెబుతున్నారు. ఇది సరికాదని అంటున్నారు. సాధారణంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్టుగానే ఉండిలోనూ రాజకీయ విభేదాలు ఉన్నాయి. కానీ వీటిని పెరగకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనపైనే ఉంటుంది.
కొందరిని మాత్రమే చేరదీసి.. మరికొందరు అసలు తనకు ఏమీ కారన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా అసంతృప్తులు పెరుగుతున్నాయి. తొలినాళ్లలో వీటిని ఖండించినప్పటికీ.. తనపై ఓ వర్గం నాయకులు ఎగస్పార్టీగా మారారంటూ చెప్పినప్పటికీ.. తర్వాత పరిణామాల్లో ఈ లెక్కలు పెరుగుతున్న తీరు రఘురామకు ఇబ్బందికర పరిణామంగానే మారింది. క్షత్రియ సామాజిక వర్గంలోనే ఆయనకు కొంత మేరకు వ్యతిరేకత ఉంది.
దీనిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఎవరైనా చెబుతున్నా.. వారిని కూడా ఆయన ఎగస్పార్టీ ఖాతాలో వేసేస్తున్నారు. మీరు నాకు చెప్పేంతవారా? అని అంటే ఎవరూ చెప్పరు. కానీ ఎంతో అనుభవం ఉన్న నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సైతం తన విధానాలు తప్పు అని సన్నిహితులు చెబితే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తరహా ధోరణే ఆయనను అందరివాడిగా నిలుపుతోంది. ఈ విషయాన్ని రఘురామ కూడా గ్రహించాలి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోకపోతే ఇబ్బందులు చెప్పిరావు కదా!?
Gulte Telugu Telugu Political and Movie News Updates