ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భూములు లేవ్‌: రేవంత్

రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద భూములు లేవ‌ని.. ఎవ‌రికీ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. పేద‌ల‌కు ఉచితంగా భూములు ఇచ్చే ఆలోచ‌న ఉన్న‌ప్ప‌టికీ.. ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని.. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భారీ భూ బ్యాంక్ ఉన్న‌ట్టుగా జ‌రుగుతున్న ప్ర‌చారంలోనూ నిజం లేద‌ని అన్నారు. ఏ సామాజికవ‌ర్గం కూడా.. ప్ర‌భుత్వం నుంచి భూములు వ‌స్తాయేమోన‌నే ఆశ‌ల‌ను విడ‌నాడాల‌ని ఆయ‌న సూచించారు. అయితే.. అన్ని సామాజికవ‌ర్గాల చిన్నారుల‌కు.. చ‌దువుకునేందుకు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌న్నారు.

ఆదివారం బంజారాల దేవుడు.. సంత్ శ్రీసేవాలాల్ జ‌యంతి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం గిరిజ‌నుల‌ను.. ముఖ్యంగా లంబాడాల‌ను మోసం చేసింద‌న్నారు. అధికారంలోకి రాగానే బంజారాల‌కు.. భూములు ఇస్తామ‌ని హామీ ఇచ్చి.. ఎగ్గొట్టార‌ని, వారికి మాత్రం ఎక్క‌డిక‌క్క‌డ ఎక‌రాల‌కు ఎక‌రాల భూములు సంపాయించుకుని విల్లాలు, ఫామ్ హౌస్‌లు కట్టుకు న్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

చ‌దువును మించిన ఆస్తి లేద‌న్న సీఎం రేవంత్‌.. బంజారాల పిల్ల‌లు చ‌దువుకుంటామంటే.. ఎంత వ‌రకైనా చ‌దివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. వాస్త‌వానికి పేద‌రికం అంటే.. ఆస్తులు లేక‌పోవ‌డం కాద‌ని.. చ‌దువు లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెప్పారు. “ఒకాయ‌న‌కి.. 20 ఎక‌రాల భూమి ఉంది. కానీ, తెల్లారిలే స్తే.. గొర్రెలు, మేక‌లు తోలుకుపోతాడు. ఆయ‌న‌కు ఆస్తి లేదా? అంటే.. ఉంది. కానీ, పేద‌రికంలోనే ఉన్నాడు. దీనికి కార‌ణం చ‌దువు లేక‌పోవ‌డ‌మే” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌..

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేయ‌డం ద్వారా ఆయా సామాజిక వ‌ర్గాల‌కు మేలు చేశామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. తండాల్లో పాఠ‌శాల‌ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని నిర్ణ‌యించామ‌న్నారు. అదేవిధంగా విద్యుత్ సౌక‌ర్యం, విద్య వంటివాటిని చేరువ చేస్తామ‌న్నా రు. ఇక‌, తాము పాల‌కులం కాద‌ని.. సేవ‌కులం కాద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.