ఒక పరాజయం ఎదురైతేనే… పార్టీలు తమను తాము సరిచేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఇక, వరుస పెట్టి పరాజయాలు వెంటాడితే.. మరేం చేయాలి?!. మరింత అప్రమత్తం కావాలి. మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి. తమ తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఇది రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఉండాల్సిన ప్రధాన లక్ష్యం. కానీ.. తెలంగాణను పదేళ్లపాటు ఏలిన బీఆర్ఎస్ పార్టీలో ఈ తరహా సంస్కృతి కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
వరుస పరాజయాలు..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. బీఆర్ఎస్ పార్టీ ఉత్థాన నుంచి పతనానికి చేరుకుంది. అధికారం కోల్పోవడమే కాదు.. పది మంది ఎమ్మెల్యేలతో పాటు.. కీలకమైన కేకే వంటి నాయకులు కూడా కేసీఆర్ నాయకత్వానికి రాం-రాం చెప్పారు. ఈ పరిణామాలను అంచనా వేసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాల్సిన కేసీఆర్ అండ్ కోలు. ఎదురు దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. తద్వారా 2024 పార్లమెంటు ఎన్నికల సమయానికి తుడిచిపెట్టుకుపోయింది.
ఒక్కటంటే ఒక్క పార్లమెంటు స్థానంలో కూడా.. బీఆర్ఎస్ గెలుపు గుర్రం ఎక్కిందే లేదు. ఇక, ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరోశరాఘాతం. అంతేకాదు.. పంచాయతీ ఎన్నికల్లోనూ చావు తప్పినట్టుగా ఎదురైన పరిస్థితి వంటివి బీఆర్ఎస్కు అనేక పాఠాలు నేర్పాయి. ఈ మధ్యలో కేసీఆర్ తనయ కవిత వ్యవహారం రాజకీయంగా పార్టీకి ఎంత నష్టం చేయాలో అంతా చేసింది. పైకి ఏమీ లేదని చెబుతున్నా.. కవిత ప్రభావం.. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో స్పష్టం చేసింది.
మునిసిపాలిటీలలో జెండా తమదేనని చాటుకున్న కేసీఆర్కు మూడు వారాలు కూడా తిరగకుండానే 116 మునిసిపాలిటీల్లో కనీసం పై 16 కూడా దక్కలేదు. కేవలం 13కు పరిమితం అయింది. మరో 13 మునిసిపాలిటీలల్లో ఒక్క వార్డును కూడా దక్కించుకోలేక పోయారు. ఇంత తేడా కొడుతున్నా.. పార్టీలో పెద్దగా చలనం కనిపించడం లేదు. ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమే. కానీ.. తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం ముఖ్యం. కానీ, ఈ తరహా ప్రయత్నం ఎక్కడా కనిపించడం లేదు.
“ఈ ఎన్నికల ఫలితాలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదు. మేమే ఖచ్చితంగా గెలిచి తీరుతాం” అని కేటీఆర్ చెప్పడాన్ని బట్టి.. కింద పడుతున్నా.. పైచేయి మాదే అన్న తరహా రాజకీయాలనే కళ్లకు కడుతున్నాయి. ఇదే విధానం కొనసాగితే.. పార్టీ పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారక తప్పదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates