ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని అమరావతి ఇక, పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఈ రెండు ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. వేరే పద్దుల్లో చూపించకుండా.. నేరుగానే ఆయా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం విశేషం. పోలవరానికి 6105 కోట్ల రూపాయలను, అమరావతికి 6000 కోట్ల రూపాయలను కేటాయించారు. వాస్తవానికి గత 2025-26 బడ్జెట్లోనూ దాదాపు ఇంతే మొత్తం ఈ రెండు ప్రాజెక్టులకు కేటాయించారు.
ప్రస్తుత కేటాయింపులకు తోడు కేంద్రం ఇచ్చే నిధులను కలుపుకొంటే.. ఈ ఏడాది ఈ రెండు ప్రాజెక్టులకు మెరుగైన కేటాయింపులే ఇచ్చారని చెప్పాలి. తద్వారా పనులు వడివడిగా ముందుకు సాగనున్నాయి. ఇక, మరో కీలక అంశం.. విశాఖ ఆర్థిక మండలి. ఈ పరిధిలోకి సుమారు 10 జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాల అభివృద్ధికి ఏకంగా 28 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. తద్వారా యుద్ధ ప్రాతిపదికన.. ఆయా జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.
వాస్తవానికి రెవెన్యూ లోటు 22 వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ.. ఆయా ప్రాజెక్టులకు భారీ మొత్తంలో కేటాయింపులు చేయడం ద్వారా.. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఏంటనేది స్పష్టమవుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. 9 వేల 106 కోట్లరూపాయలను హోం శాఖకు కేటాయించింది. ఈ నిధులతో సీసీ కెమెరాలు, 3 వేల పోలీసు వాహనాలను కొనుగోలు చేయనున్నారు. స్మార్ట్ పోలీసింగ్తోపాటు సైబర్ నేరాల కట్టడికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
అదేవిధంగా మౌలిక సదుపాయాల రంగానికి ఊతమివ్వడం ద్వారా పెట్టుబడులకు ప్రాధాన్యం పెంచారు. వీటిలో ప్రధానంగా రాష్ట్ర రహదారులు, పోర్టుల అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయించారు. 13546 కోట్ల రూపాయలను ఈ మౌలిక రంగానికి కేటాయించారు. తద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం రానుంది.
రెండు ఆర్థిక నగరాల ప్రతిపాదన..
తాజాగా బడ్జెట్లో రెండు ఆర్థిక నగరాలను ప్రతిపాదించారు. 10 జిల్లాలతో కూడిన విశాఖ ఆర్థికనగరాన్ని, 7 జిల్లాలతో అమరావతి ఆర్థిక నగరాన్ని ప్రకటించారు. ఈ రెండు ఆర్థిక నగరాల్లోనే దాదాపు రాష్ట్రంలోని అన్నిజిల్లాలు వస్తాయని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates