ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు నమోదు విధానంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకున్న కీలక నిర్ణయంతో మాన్యువల్ రిజిస్టర్ సంతకాల పద్ధతికి స్వస్తి పలుకుతూ పూర్తిస్థాయి డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమల్లోకి రానుంది.
ఇకపై సభ్యులు సభలోకి వచ్చి తమకు కేటాయించిన సీటులో కూర్చున్నప్పుడే హాజరు నమోదు కానుంది. ఇప్పటివరకు సమావేశ మందిరం వెలుపల ఉన్న రిజిస్టర్లో సభ్యులు సంతకాలు చేసి హాజరు నమోదు చేసుకునేవారు.
అయితే సభలోకి రాకుండానే కొందరు సభ్యులు సంతకాలు చేసి అలవెన్సులు పొందుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన కొందరు సభ్యులపై వచ్చిన ఈ విమర్శల నేపథ్యంలో వ్యవస్థలో మార్పులు అవసరమని భావించిన స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుతో వైసీపీ ఎమ్మెల్యేకు ఇకపై జీతాలు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త విధానం ప్రకారం ఫేస్ రికగ్నిషన్, కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను వినియోగించి హాజరు నమోదవుతుంది. అసెంబ్లీ హాల్లో పాన్, టిల్ట్, జూమ్ కెమెరాలను ఏర్పాటు చేసి సభ్యులు తమ స్థానాల్లో కూర్చున్నప్పుడే హాజరు లెక్కలోకి వచ్చేలా సాంకేతిక వ్యవస్థ రూపొందిస్తున్నారు.
ఇకపై మాన్యువల్ రిజిస్టర్లు ఉండవని అసెంబ్లీ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్ బులిటెన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రతి హాజరు డేటా డిజిటల్గా నమోదు కావడంతో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే సభ్యుల హాజరు శాతం స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. సీఎం డ్యాష్బోర్డుకు చేరే ఈ సమాచారం ఆధారంగా సభ్యుల పనితీరు అంచనా వేయవచ్చు. భవిష్యత్తులో పార్టీలు టికెట్లు కేటాయించే సమయంలో కూడా హాజరు రికార్డులు ప్రమాణంగా మారే అవకాశాన్ని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
అయితే మరోవైపు గోప్యత, సాంకేతిక లోపాలు, ఫేస్ రికగ్నిషన్ ఖచ్చితత్వం వంటి అంశాలపై కూడా చర్చ మొదలైంది. ప్రతిపక్షం ఈ వ్యవస్థపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో చూడాలి. ఇకపై సభకు రాకుండా హాజరు చూపించే అవకాశం లేకుండా పోవడంతో సభ్యులు తప్పనిసరిగా సభలో హాజరవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
ఈ నిర్ణయం అసెంబ్లీ పనితీరులో నాణ్యతను పెంచుతుందా? రాజకీయ వాదోపవాదాలకు దారి తీస్తుందా? అన్నది రాబోయే సమావేశాల్లో స్పష్టమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates