ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ఓ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే కార్యక్రమానికి దళపతి విజయ్ రావడం, జగన్ పక్కనే ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
విజయ్–జగన్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు తమ తమ ఊహాగానాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ అనుబంధ సోషల్ మీడియా ఈ ఫోటోలు, వీడియోలకు విస్తృత ప్రచారం ఇస్తోంది. ఇద్దరినీ పోలుస్తూ పోస్టులు పెడుతోంది. సాక్షి మీడియాలో కూడా జన నాయకుడు జగన్ తో జన నాయగన్.. అంటూ ఈ భేటీకి ప్రాధాన్యత ఇస్తూ కథనాలు వెలువడ్డాయి.
గతంలో తమిళనాడులో విజయ్ అభిమానులు ఏర్పాటు చేసిన కొన్ని బ్యానర్లలో జగన్ చిత్రాలు కనిపించాయి. ఏపీలో జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినట్లే, తమిళనాడులో తాను స్వతంత్రంగా పోటీ చేస్తానని విజయ్ ప్రకటించిన అంశాన్ని అభిమానులు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.
ఇదే వేడుకకు మంచు మోహన్ బాబు, సూర్య, కార్తీ తదితరులు కూడా హాజరయ్యారు. అయితే విజయ్ జగన్ పక్కన కూర్చున్న ఫోటోలు, ఆయనతో మాట్లాడుతున్న దృశ్యాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ, సినీ వర్గాల్లో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
