ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రెడీ?

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఘ‌ట్టం ప్రారంభం అయింది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన ముంద‌స్తు కార్యాచ‌ర‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి ల‌భించింది. దీంతో ఓట‌ర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు సిద్ధ‌మ‌య్యారు. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాల‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీని అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని గ్రామ పంచాయ‌తీల‌లో ఓట‌ర్ల‌ జాబితాలు తయారు చేయాల‌ని దిశానిర్దేశం చేసింది. సిద్ధమైన ఓటరు జాబితాలను మార్చి 9న(అంటే నెల రోజుల్లో ) అన్ని వార్డు, గ్రామ స‌చివాల‌యాల్లో ప్రచురించనున్నారు.

ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల జాబితాల‌పై వ‌చ్చే అభ్యంత‌రాల‌ను 15 రోజుల వ‌ర‌కు స్వీక‌రించ‌నున్నారు. వాటికి ప‌రిష్కారం చూపిస్తారు. కొత్త‌గా ఓట‌రుగా న‌మోద‌య్యేందుకు గ్రామ పంచాయ‌తీ స్థాయిలో ఇప్పుడు అవ‌కాశం లేద‌ని.. జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు ఎంత మంది ఉంటే అంత‌మందికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని పేర్కొంది.

ఎప్పుడు జ‌ర‌గొచ్చు..

ప్ర‌స్తుతం ఈ నెల చివ‌రిలో దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న ప్రారంభం కానుంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ఈ నెల 20వ తేదీలోగా నిర్వ‌హించాల‌ని గ‌తంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్రాల‌కు సూచించింది. అయితే.. ఏపీలో మాత్రం మార్చి 31 వ తేదీ వ‌ర‌కు పంచాయ‌తీల‌కు గ‌డువు ఉంది.

దీంతో మార్చి 31 త‌ర్వాతే..కొత్తగా పంచాయ‌తీల్లో పాల‌న ప్రారంభం అవుతుంది. అయితే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ప్ర‌త్యేక ప్ర‌తిపాద‌న తీసుకునే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల నుంచి స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ.. ఈ అనుమ‌తి ఎప్పుడు వ‌స్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. అప్ప‌టి వ‌ర‌కు కూడా ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌లోనే( విలేజ్ సెక్ర‌ట‌రీ) పంచాయ‌తీలు న‌డ‌వ‌నున్నాయి.