మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. సిట్ నివేదికను వైసీపీ తప్పుదారి పట్టిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ నిర్వహించారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజలను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.
ప్రతి సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధను మనలోనే దాచుకొని “కర్మ చూసుకుంటుంది” అని అనుకుని మౌనంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ఈ విధానం ఖచ్చితంగా మారాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మన సహనాన్ని బలహీనంగా చూపిస్తుందని పేర్కొన్నారు. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా మన ధర్మ పరిరక్షకులుగా మారాలని పవన్ ట్వీట్ చేశారు.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని, కేవలం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవడమే అని ఆయన స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
