అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన అంబటి రాంబాబు గృహాన్ని పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తరచూ బూతులు మాట్లాడుతూనే ఉన్నారని, అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
చంద్రబాబును తిట్టాడనే కారణంతో అంబటి రాంబాబును అరెస్టు చేశారని, అదే సమయంలో ఆయన కుటుంబంపై దాడులు చేసిన స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్తపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గొప్ప విలువలతో జీవించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో కొట్టారని ఆరోపించారు.
ప్రాణభయంతో అంబటి రాంబాబు ఆ మాటలు మాట్లాడాడని, ఆ తర్వాత తాను అలా మాట్లాడకూడదని బాధపడ్డాడని జగన్ తెలిపారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని హెచ్చరిస్తూ, రాబోయేది తమ ప్రభుత్వమేనని, జరిగిన ప్రతి దానికి వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు.
అన్నింటిపైనా విచారణలు వేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు విషపూరిత విత్తనాలు నాటుతున్నారని, వారి కారణంగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు దెబ్బతిన్నారని ఆరోపించారు. రేపు తమ కార్యకర్తలు స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. పోలీసుల సమక్షంలోనే విధ్వంసం జరిగిందని, టీడీపీ గూండాలు విధ్వంసం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు.
టీడీపీ గూండాల కుట్రలో పోలీసులు కూడా భాగమయ్యారని, ఎస్పీ, డీజీపీ కార్యాలయాలకు సమీపంలోనే ఈ ఘటనలు జరిగాయని జగన్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేసిన తప్పులకు వారు లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
సీబీఐ స్పష్టంగా చెప్పినా మళ్లీ గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారని, కుల, మతాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతూ ఫ్లెక్సీలు పెడుతున్నారని తిరుమల లడ్డు వివాదంపై జగన్ స్పందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates