ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదని, అదనంగా వసూలు చేస్తున్నారని, ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని చెప్పినా ఎవరూ స్పందించడం లేదన్నారు. ఒక్కో బాటిల్పై రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పవన్ హెచ్చరించారు.
లిక్కర్ వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలను దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని, దీనికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా పవన్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. గరిష్ట చిల్లర ధరపై ఒక్కో బాటిల్కు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వమే మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం అలా ఆదేశాలు ఇచ్చిందీ లేనిదీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. అధిక ధరలకు అమ్మడం నిబంధనలకు విరుద్ధమని, అక్రమాలకు పాల్పడే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో వైసీపీ కూడా ఇలా అధిక ధరలకు మద్యం విక్రయించి చెడ్డపేరు తెచ్చుకుందని, ప్రజలు పక్కన పెట్టారని ఈ సందర్భంగా జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు వైన్ షాపులపై నిరంతరం నిఘా ఉంచాలని పవన్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates