కేసీఆర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక, కేసీఆర్ చావును రేవంత్ కోరుకుంటున్నారని, పదే పదే ఆ తరహా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కూడా విమర్శించారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నడుము విరిగి కింద పడ్డారని, ఆయన తనకు శత్రువేంటి అని ప్రశ్నించారు రేవంత్.

ఫాం హౌస్ లో కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని, ఆయన లేచి నిలబడ్డప్పుడు కదా తాను మాట్లాడేది అని అన్నారు. తనకు శత్రువులెవరూ లేరని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు కూడా కాలేదని, దిగిపో అంటూ తనను డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.

అయితే, దిగిపోమని చెప్పడానికి ఇదేమన్నా నీ అయ్య జాగీరా, నీ తాత ఆస్తా అని రేవంత్ ప్రశ్నించారు. నాలుగున్నర కోట్ల ప్రజలు గెలిపిస్తే ఇక్కడకి వచ్చానని అన్నారు. పాలమూరోళ్లంటే కేసీఆర్ కు చిన్నచూపని, తమ మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దని హెచ్చరించారు.

ఇక, బతుకమ్మ చీరల్లోనూ బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని, తొలి ఏడాదిలోనే తాము 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు.

ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కు చేతనైతే ఆశీర్వదించాలని, లేదంటే ఫాం హౌస్ లో కూర్చోవాలని చురకలంటించారు. అలాకాకుండా మారువేషాలలో మారీచులను పంపితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.