చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించిన బండ్ల గణేశ్, తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.

షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై తనకు ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకునే భాగంగానే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో, ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బండ్ల గణేశ్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కోరిక నెరవేరిన నేపథ్యంలో, ఇప్పుడు మొక్కు తీర్చుకునే కార్యక్రమంగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్న బండ్ల గణేశ్, కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బండ్ల గణేశ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో అనుబంధం ఉన్న కార్యక్రమం కావడంతో ఈ మహా పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటోంది.