కలెక్టర్లపై ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కలెక్టర్లు గ్రహణం, దరిద్రం పట్టినట్లుగా పట్టారని ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. 14 నెలలుగా తనకు జీతమివ్వడం లేదని, ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా తన జీతం ఫైల్ క్లియర్ చేయడం లేదని ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే విమర్శించారు.
14 నెలలుగా ఒక ఫైల్ క్లియర్ చేయలేని అధికారికి ఆ సీటులో కూర్చునే అర్హత లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దొంగలు, టైమ్ పాస్ చేసే వ్యక్తులు ఐఏఎస్ వ్యవస్థలోనూ ఉన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కలెక్టర్లిచ్చిన సమాచారంతోనే 2019లో చంద్రబాబు, 2024లో జగన్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే దీపక్రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. దీంతో, దీపక్ రెడ్డి జీతం బకాయిలు విడుదల చేస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన దీపక్ రెడ్డి జీత బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. దీపక్ రెడ్డి కామెంట్లతో కూటమి ప్రభుత్వానికి కాస్త డ్యామేజీ జరిగింది. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అయి ఆ ఇష్యూపై ఫోకస్ చేసింది.
వాస్తవానికి ఇటువంటి అసంతృప్తిని దీపక్ రెడ్డి బహిరంగంగా వెళ్లగక్కారు. కానీ, బయటపడని వారు ఇంకా చాలామంది ఉన్నారు అని టీడీపీ నేతలు కొందరు అనుకుంటున్నారు. ఓ పక్క బ్యూరోక్రాట్లను, మరో పక్క పొలిటిషియన్లను బ్యాలెన్స్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates