రేవంత్ ను టార్గెట్ చేసిన సీనియర్లు

రేవంత్ రెడ్డి..పరిచయం అవసరం లేని పేరిది. కేసీయార్ అన్నా ఆయన కుటుంబం అన్నా ఒంటికాలిపై లేచి ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతుంటారు. ఒకానొక దశలో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిన తర్వాతే కదలికొచ్చింది. టీడీపీలో బాగా యాక్టివ్ గా ఉండే రేవంత్ కాంగ్రెస్ లో చేరిన కొద్దిరోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. రేవంత్ పార్టీలో చేరేనాటికి కేసీయార్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామంది హైడవుట్లోకి వెళ్ళిపోయున్నారు.

అలాంటి దశలో టీడీపీలో నుండి తనతో పాటు తన మద్దతుదారులను కూడా కాంగ్రెస్ లో చేర్చటం ద్వారా మళ్ళీ కాస్త స్పీడుపెంచారు. కేసీయార్+కుటుంబాన్ని టార్గెట్ చేయటం ద్వారా పార్టీ శ్రేణుల్లో కాస్త కదలిక తెచ్చారు. ఈరోజే రేపో పీసీసీ ప్రెసిడెంట్ ను చేయబోతున్నారనే వార్త చాలాకాలంగా వినిపిస్తునే ఉంది. అయితే ఇదే సమయంలో ఆ నియామకం వెనక్కుపోతునే ఉంది.

ఈ నేపధ్యంలో దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలో ఘోర పరాజయంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దాంతో కొత్త అధ్యక్షుడి అన్వేషణ మొదలైంది. రేసులో రేవంత్ తో పాటు మాజీ ఎంపిలు వీహెచ్, మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పోటీ పతున్నారు. ఇక భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గట్టిపోటీదారయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోటీదారుల్లో ఎవరికి వారికే అధిష్టానం దగ్గర గట్టి పట్టేఉంది.

అందుకనే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నా రేవంత్ దగ్గరకు వచ్చేసరికి అందరు ఒకటవుతున్నారు. నిజంగానే రేవంత్ కు వ్యతిరేకంగా అందరు ఏకమవుతున్న విషయం అందరికీ అర్ధమైపోయింది. వీళ్ళందరి దృష్టిలో రేవంత్ తమకన్నా చాలా జూనియర్ అని. అయితే వీళ్ళందరికన్నా రేవంత్ ఎందులో మేలంటే మంచి మాటకారి. కేసీయార్ అన్నా ఆయన కుటుంబంమీదన్నా తిరుగులేని పోరాటాలు చేస్తున్నారు. ఏ దశలో కూడా కేసీయార్ తో తెరవెనుక చేతులు కలిపే అవకాశం లేదని చెప్పచ్చు.

రేవంత్ ను వ్యతిరేకించటమే టార్గెట్ గా అందరు ఏకమవుతున్నారే కానీ పార్టీని ఏకతాటిపై నడిపించే సత్తా ఎంతమందిలో ఉంది అన్నదే ప్రశ్న. మొత్తానికి పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కసరత్తు చేస్తున్న తెలంగాణా ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ చివరకు ఢిల్లీ పెద్దలకు ఏమి చెబుతున్నారన్నది సస్పెన్సుగా మారింది. మొదటి నుండి కాంగ్రెస్ కు గ్రూపు రాజకీయాలే మైనస్సు అదే ప్లస్సు కూడా. చూద్దాం ఈసారి ఏమవుతుందో.