మోడి, సోనియాలపై ప్రణబ్ సంచలన వ్యాఖ్యలు

‘ప్రధానమంత్రి నరేంద్రమోడి ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు…పార్టీ వ్యవహారాలను సమర్ధవంతంగా వ్యవహరించటంలో సోనియా విఫలమయ్యారు’ … తాజాగా బయటపడిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో మామూలు నేతో లేకపోతే వ్యక్తో కాదు. స్వయంగా భారత రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చేయటంతో రాజకీయంగా చాలా సంచలనంగా మారాయి. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ తాను రాసిన ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ లో మోడి, సోనియా, మన్మోహన్ సింగ్ ల వ్యవహార శైలిపై అనేక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ప్రణబ్ రాసిన పుస్తకం జనవరిలో మార్కెట్లోకి రాబోతోంది. పుస్తకాన్ని ప్రచురిస్తున్న ప్రచురణ సంస్ధ మాజీ రాష్ట్రపతి రాసిన ఆత్మకథలోని కొన్ని వవరాలను లీక్ చేసిందో లేకపోతే ఉద్దేశ్యపూర్వకంగా విడుదల చేసిందో తెలీదు. మొత్తానికి ఇటు మోడి అటు సోనియా పై ప్రణబ్ చేసిన వ్యాఖ్యలైతే కలకలం సృష్టిస్తున్నాయి. భారతదేశ రాజకీయాలతో సుదీర్ఘ అనుంబంధం ఉన్న ప్రణబ్ తన అనుభవాలతో ఓ పుస్తకం రాయటమంటే మామూలు విషయం కాదు. ఎంపిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో ట్రబులు షూటర్ గా చివరకు రాష్ట్రపతిగా పనిచేసి రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు.

మోడి గురించి తన పుస్తకంలో మాట్లాడుతూ తొలి ఐదేళ్ళ పాలనలో నరేంద్రమోడి నియంత్రుత్వ విధానాలను అనుసరించారని అభిప్రాయపడ్డారు. ఆ కాలంలో ప్రభుత్వం-చట్టసభలు-న్యాయవ్యవస్ధ మధ్య చేదు సంబంధాలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయం రెండోదఫా అధికారం అందుకున్నాక ఇంకా బాగా అనుభవంలోకి వస్తుందని కూడా మాజీ రాష్ట్రపతి అంచనా వేశారు. ఇర పార్టీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించటంలో సోనియా విఫలమవ్వటం, మన్మోహన్ సింగ్-ఎంపిలకు మధ్య వ్యక్తిగత సంప్రదింపులు ముగిసిపోవటం పార్టీ పతనానికి దారితీసినట్లు అభిప్రాయపడ్డారు.

2004లో తాను ప్రధాని అయ్యుంటే 2014లో పార్టీ ఘోరఓటమికి గురయ్యేది కాదని పార్టీలో చాలామంది అన్నారట. అయితే వాళ్ల అభిప్రాయాలతో తాను ఏకీభివించలేదని కూడా చెప్పారు. అయితే తాను రాష్ట్రపతిగా వెళ్ళిన తర్వాత పార్టీ రాజకీయ దృష్టిని కోల్పోయిందని మాత్రం కచ్చితంగా అభిప్రాయపడ్డారు. హౌస్ కు మన్మోహన్ దూరంగా ఉడిపోవటం వల్లే ఎంపిలతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కోల్పోయారని చెప్పారు.

మొత్తానికి ఇటు నరేంద్రమోడి అటు సోనియాగాంధీల వ్యవహారశైలిపై తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రణబ్ పెద్ద సంచలనమే రేపారని చెప్పాలి. జనవరిలో మార్కెట్లో పుస్తకం విడుదలైన తర్వాత అందులో ఇంకెన్ని సంచలనాలుంటాయో చూడాల్సిందే. మొత్తం మీద తాజాగా బయటపడిన ట్రైలర్ కారణంగా ఈ పుస్తకంపై చాలామందిలో ఆసక్తి పెరిగిపోవటం ఖాయం. చూద్దాం అసలు సినిమాలో ఏముంటుందో.