2025లో తన బెంచ్ మార్క్ పాలనతో ఏడాదంతా క్షణం తీరిక లేకుండా ప్రజల్లో గడిపిన సీఎం చంద్రబాబు.. తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చేది ఏమిటో చెప్పేశారు. ఉంటే సచివాలయంలో లేదంటే ప్రజల్లో అన్నట్లు బాబు తన పూర్తి సమయాన్ని వెచ్చించారు. ఇందులో ముఖ్యంగా ప్రతి నెల మొదటి తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పేదల ఇంటికి వెళ్లి జరుపుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 31వ తేదీనే పేదలకు పెన్షన్లు ఇస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్రతిహతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛను పంపిణీ తనకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
‘కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ.. ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నాం. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు పెట్టాం. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛను ఇచ్చేందుకు రూ.2743 కోట్లు విడుదల చేశాం. 1వ తేదీన పింఛను ఇవ్వాల్సి ఉన్నా కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పింఛన్ పంచే ఏర్పాటు చేశాం..’ అని ఆయన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates