తిరుపతిపై చంద్రబాబు లెక్కలు !

‘తిరుపతి లోక్ సభలో మొన్న వైసీపీకి వచ్చిన 10 శాతం ఓట్లలో 5 శాతం మనం లాగేసుకుంటే టీడీపీదే విజయం మనదే’ ..ఇది చంద్రబాబునాయుడు తాజాగా తిరుపతి లోక్ సభ పరిదిలోని నేతలతో చంద్రాబాబు చెప్పిన మాటలు. నేతలతో జూమ్ కాన్ఫరెన్సు లో మాట్లాడిన చంద్రబాబు ఉపఎన్నిక విషయంలో చాలా లెక్కలే చెప్పారు. లెక్కల్లో 1+1=2 అవుతుందేమో కానీ రాజకీయాల్లో 1+1= 0 కూడా అయ్యే అవకాశం ఉందని మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎలా మరచిపోయారో.

ముందుగా చంద్రబాబు చెప్పిన 10 శాతం లెక్కేమిటో చూద్దాం. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు 49.95 శాతం. ఇక టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం 39.17. ఇందులో వైసీపీకి వచ్చిన ఓట్ల శాతంలో ఓ 5 శాతం మనం లాగేసుకోవాలన్నది చంద్రబాబు చెప్పిన లెక్క. ఇక తిరుపతి నియోజకవర్గం విషయం చూద్దాం. బల్లి దుర్గాప్రసాదరావుకు 55.03 శాతం ఓట్లొచ్చాయి. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 37.65 శాతం ఓట్లొచ్చాయి. అంటే ఇద్దరి మధ్య 17.38 శాతం ఓట్లు తేడా ఉంది.

చంద్రబాబు చెప్పినట్లుగా 5 శాతం ఓట్లు వైసీపీ నుండి బయటకు వచ్చేసినా టీడీపీ అభ్యర్ధి గెలిచే అవకాశాలు లేవు. 17.38 ఓట్ల శాతం ఆదిక్యత వచ్చిన వైసీపీ ఓడిపోవాలంటే టీడీపీకి 8.8 శాతం ఓట్లు రావాలి. అసలు 17.38 శాతం ఓట్లు వైసీపీకి వ్యతిరేకం అయ్యే పరిస్ధితులు రాష్ట్రంలో ఉన్నాయా ? చంద్రబాబు చెప్పినట్లుగా అన్ని ఓట్లు వైసీపీ నుండి వచ్చేసి టీడీపీకి పడతాయా ? లేకపోతే మొన్న టీడీపీకి పోలైన 37.65 శాతం ఓట్లకే ఇంకా చిల్లు పడి వైసీపీకి + అవుతాయా అన్నది భవిష్యత్తే చెప్పాలి.

సరే ఈ విషయాన్ని ఇలాగ ఉంచేస్తే మరి బీజేపీ+జనసేన మిత్రపక్షాల మాటేమిటి ? తిరుపతి ఉపఎన్నికలో గెలవబోయేది తామే అని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంత చెప్పుకుంటున్నా పార్టీ అసలు బలం ఏమిటో అందరికీ తెలుసు. పైగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర స్ధానాన్ని తాము భర్తీ చేస్తామని వీర్రాజు ఇప్పటికే పదే పదే చెప్పారు. రేపటి తిరుపతి ఉపఎన్నికలో రెండోస్ధానంలో నిలవటానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. బీజేపీ ఎంతగా పుంజుకుంటే అంత ఇరు పార్టీలకీ నష్టమే.

మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావు మెజారిటినే 2.28 లక్షలు. వైసీపీకి సుమారుగా 7 లక్షల చిల్లర ఓట్లొస్తే టీడీపికి వచ్చింది 4.9 లక్షల చిల్లర ఓట్లు. ఇక బీజేపీకి వచ్చిన ఓట్లు 16 వేలు. అంటే 16 వేల నుండి బీజేపీ ఎవరి నుంచి ఎంత చీలుస్తుందో ఒక పట్టాన ఇపుడే చెప్పలేం. అయితే, తిరుమలను అనేక వివాదాల్లోకి నెట్టిన జగన్ ను బీజేపీ హిందుత్వ కార్డుతో కనుక చీల్చగలిగితే బీజేపీ చీల్చే ప్రతి జగన్ ఓటు టీడీపీకి లాభిస్తుంది. బీజేపీ బలపడితే బాబుకి అక్కడ మంచిదే గాని ఆ ఓట్ల తనవి కాకుండా చూసుకోవాల్సిన తలనొప్పి మాత్రం తప్పదు.