యూపీఏ వైఫ‌ల్యాలు.. మోడీకి వ‌రాలు.. ఇప్పుడు జ‌రుగుతోంది ఏంటి?

ఒక ప్ర‌భుత్వ వైఫ‌ల్యం నుంచి పుట్టుకొచ్చిన మార్పు ఫ‌లితంగానే మ‌న దేశంలో ప్ర‌భుత్వాలు మారుతున్నాయి. అయితే.. ఏ ప్ర‌భుత్వ‌మూ కూడా ఈ మార్పుల‌ను లోతుగా విశ్లేష‌ణ చేయ‌క‌పోవ‌డం.. అంతా బాగుంద‌నే భ్ర‌మ‌లో ఉండ‌డం కామ‌న్‌గా జ‌రుగుతున్న ప‌రిణామం. దీంతో ఎంత బ‌ల‌మైన ప్ర‌భుత్వమైనా.. కూలిపోతుండ‌డం మ‌రో చిత్ర‌మైన విష‌యం. ప్ర‌స్తుతం టీ బాయ్‌.. న‌రేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే స‌ర్కారు రెండు సార్లు కొలువుదీరింది. నిజానికి బీజేపీ వంటి హిందుత్వ అజెండా ఉన్న పార్టీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకిరావ‌డం నిజంగా చాలా సంచ‌ల‌నం సృష్టించిన విష‌య‌మే.

అయితే.. ఇలా.. రెండు సార్లు బీజేపీకి అధికారం క‌ట్ట‌బెట్ట‌డం వెనుక‌.. ప్ర‌జ‌ల్లో ఉన్న ఆలోచ‌న వేరు.. అధికారంలోకి వ‌చ్చిన నాయ‌కులు చేస్తున్న ఆలోచ‌న వేరుగా ఉండ‌డమే చిత్రంగా ఉంది. యూపీఏ ప్ర‌బుత్వాన్ని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన ప్ర‌జ‌లే ఇప్పుడు.. ఎన్డీయేకి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చార‌నేది తెలిసిన విష‌యం. అయితే.. అప్ప‌టి యూపీఏ అనుస‌రించిన విధానాల‌నే ఇప్పుడు న‌రేంద్ర మోడీ స‌ర్కారు కూడా అనుస‌రిస్తోంద‌ని.. నాడు సోనియా నేతృత్వంలో సాగిన పాల‌న‌కు భిన్నంగా ఏమీలేద‌ని.. అంటున్నారు సామాన్యులు. నాడు ప్ర‌పంచీక‌ర‌ణ పేరుతో.. యూపీఏ ప్ర‌బుత్వం కార్పొరేట్ల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించింది.

రైతుల‌ను ప‌ట్టించుకోలేదు. నిరుద్యోగం పెరిగిపోతున్నా.. అంతా బాగుంద‌నే నినాదాన్ని అందుకున్నారు యూపీఏ నేత‌లు. అదేస‌మ‌యంలో అవినీతి పెచ్చ‌రిల్లి.. రోజుకో కుంభ‌కోణం వెలుగు చూసింది. ఇక‌, అన్నా హ‌జారే నేతృత్వంలో రైతులు త‌మ‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌లు ల‌భించేలా చూడాలంటూ.. గ‌గ్గోలు పెట్టారు. ఇక‌, లోక్‌పాల్ కోసం చేసిన ఉద్య‌మం కూడా యూపీఏకి చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఇవ‌న్నీ క‌లిసే.. యూపీఏకి పెద్ద ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టాయి. క‌ట్ చేస్తే.. బీజేపీ పాల‌న‌లో లేనిద‌ల్లా.. ఏదైనా ఉంటే.. అవినీతి మాత్ర‌మే త‌ప్ప‌.. మిగిలిన‌వి మాత్రం య‌థాత‌థంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, రాజ‌కీయంగా చూసుకున్నా.. నాటి యూపీఏ హ‌యాంలో ప్ర‌ధాని కాక‌పోయినా.. సోనియా కేంద్రంగా కేంద్రంలో పాల‌న సాగితే ఇప్పుడు దానికి భిన్న‌మైన పాల‌న ల‌భించ‌డం లేద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు చెబుతున్నారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారికి స్వేచ్ఛ లేక పోవ‌డం.. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధాని వ‌ర‌కు తీసుకువెళ్లే చొర‌వ లేక‌పోవడాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఇక‌, తాజాగా వెలుగు చూసిన రైతుల ఉద్య‌మం కూడా ఈ కోవ‌లేదో. నిజానికి మంత్రుల‌కు చాలా మందికి రైతు చ‌ట్టాల‌పై పెను భ‌యం ఉంది. ఈ క్ర‌మంలోనే సాహ‌సం చేసిన అప్ప‌టి కేంద్ర మంత్రి కౌర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

కానీ, మిగిలిన వారిలో ఆధైర్యం లేక పోయింది. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి చేయి దాటిపోయింది. ఈ ప‌రిణాల‌పై ఎలా స్పందిస్తార‌నే విష‌యం కూడా ఇప్పుడు మోడీ కోర్టులోకే మంత్రులు నెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇలా అధికారాన్ని, పాల‌న‌ను కేంద్రీకృతం చేసుకున్న పుణ్య‌మే యూపీఏ వైఫ‌ల్యం చెంద‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తున్నా.. దీనిని నుంచి పాఠాలు నేర్వ‌ని.. మోడీ.. ఇంకా త‌న‌దైన విన్యాసాలు చేస్తూనే ఉండ‌డం వ‌చ్చే ఓట‌మిని ఊహించ‌లేక‌నేనా? లేక‌.. త‌న‌కు ప్ర‌త్యామ్నాయం లేదు క‌నుక‌.. త‌ను ఆడిందే ఆట అనుకుంటున్నారా? అనేది చ‌ర్చ‌నీయాంశం.