వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, విశాఖలో రుషికొండ ప్యాలెస్ కోసం జగన్ 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ, జనసేన, బీజేపీలు దుమ్మెత్తిపోశాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా రుషికొండ ప్యాలెస్ అంశంపై జగన్ స్పందించారు. తాను 240 కోట్ల రూపాయలు పెట్టి రుషికొండ ప్యాలెస్ కడితే విమర్శలు చేశారని, కానీ, కూటమి ప్రభుత్వం ఒక్క రోజు యోగా కార్యక్రమం కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, అది పెద్ద స్కాం అని విమర్శించారు.
విశాఖకే రుషికొండ ప్యాలెస్ తలమానికంగా, ఆణిముత్యంగా మారిందని, మంచి పర్యాటక ప్రాంతంగా ఆ బిల్డింగ్ ఉందని అన్నారు. ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వంటి పెద్ద పెద్ద వాళ్లు వచ్చినప్పుడు వారు బస చేసేందుకు ఆ రిసార్ట్ రాజభవనంలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు.
ఒక్క రోజు యోగాకు చంద్రబాబు నాయుడు 330 కోట్ల రూపాయలు ఆవిరి చేశారని, అది స్కాం కాక మరేంటని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఆ కార్యక్రమంలో వాడిన మ్యాట్ ఒక్కొక్కటి ఎంతో అమెజాన్ లోకి వెళ్లి కొడితే కనిపిస్తుందని, అదో పెద్ద స్కాం అని ఆరోపించారు.
అయితే, రుషికొండ రిసార్ట్ లేదా ప్యాలెస్ ను చూసేందుకు మీడియా ప్రతినిధులను, ప్రతిపక్ష పార్టీ నేతలను కూడా అనుమతించని జగన్ ఈ రోజు ఇలా మాట్లాడడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విశాఖకు వచ్చారని, 3 లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద యోగా ఈవెంట్ ను నిర్వహించిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందని గుర్తు చేస్తున్నారు. “యోగాంధ్ర-2025” కార్యక్రమం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించిన విషయం జగన్ మరిచిపోయారని విమర్శిస్తున్నారు.
3 లక్షలకు పైగా ప్రజలు ఒకే చోట యోగా చేయడం ఒక రికార్డు అని, 22,000 మందికి పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయడం రెండో రికార్డు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రుషికొండ ప్యాలెస్ కు యోగాంధ్ర కార్యక్రమానికి అసలు సంబంధమే లేదని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates