సీఎం వచ్చినా తగ్గేదేలే అంటున్న ఉద్యమకారులు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి నిరాకరించారని, తెలంగాణ గడ్డపై ముందుగా అందె శ్రీ, గద్దర్ వంటి స్థానిక కళాకారులకు, ఉద్యమకారులకు గౌరవం దక్కాలని వారు వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

దీంతో, రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అయితే, సీఎం వచ్చినా సరే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని, తగ్గేదే లే అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్విరాజ్‌ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను ఎన్ని రోజులు కాపలా పెడతారో చూస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీలో తెలంగాణ కళాకారులకు గుర్తింపు ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దివంగత సీఎం రోశయ్య విగ్రహం పెట్టారని, కానీ, చెన్నారెడ్డి, అంజయ్య వంటి తెలంగాణకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రుల విగ్రహాలు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరుల ఆత్మ వంచన జరుగుతోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కవులను బొంద పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కవులు, సాహిత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని ఫైర్ అయ్యారు. కాగా, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా హాజరు కాబోతున్నారు.