టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా భవిష్యత్తు కోసం ఒక భారీ ఆఫర్ ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ను తిరుగులేని శక్తిగా మార్చడానికి ఏకంగా 17.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.48 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఇది మామూలు విషయం కాదు.
ఈ పెట్టుబడి ముఖ్య ఉద్దేశం ఇండియాలో ‘ఏఐ ఫస్ట్ ఫ్యూచర్’ నిర్మించడం. అంటే భవిష్యత్తు అంతా ఏఐ టెక్నాలజీదే కాబట్టి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, యువతకు కావాల్సిన స్కిల్స్ నేర్పించడం, దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ఈ డబ్బును ఖర్చు చేయనున్నారు. ఇండియాలో టాలెంట్ కు కొదవలేదని, దానికి సరైన సపోర్ట్ దొరికితే అద్భుతాలు సృష్టిస్తారని మైక్రోసాఫ్ట్ నమ్ముతోంది.
ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆ సంస్థ ఇన్వెస్ట్ చేయలేదు. దీన్నిబట్టి ఇండియా మార్కెట్ మీద, ఇక్కడి గ్రోత్ మీద ఆ సంస్థకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీతో జరిగిన చర్చలు చాలా స్ఫూర్తిదాయకంగా సాగాయని, ఇండియా ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని నాదెళ్ల పేర్కొన్నారు.
ఈ విషయాన్ని సత్య నాదెళ్ల స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “మోదీ గారితో మాట్లాడటం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇండియా ఆశయాలకు మద్దతుగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఆసియాలోనే మా అతిపెద్ద పెట్టుబడిని ప్రకటిస్తున్నాం” అని ఆయన పోస్ట్ చేశారు. ఇది భారత టెక్నాలజీ రంగానికి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.
ఈ డీల్ వల్ల రాబోయే రోజుల్లో ఇండియాలో డేటా సెంటర్లు పెరగడం, లక్షలాది మందికి ఏఐ ట్రైనింగ్ దొరకడం, కొత్త ఉద్యోగాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం ఏఐ వైపు చూస్తున్న సమయంలో, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ ఇండియాను తన పార్టనర్ గా ఎంచుకోవడం దేశ ప్రతిష్టను పెంచే అంశం.
Gulte Telugu Telugu Political and Movie News Updates