పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజకీయ పరమైన అంశాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, వాకౌట్లు, ప్లకార్డుల ప్రదర్శనలు ఇలా.. అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ పరంపరలో అనూహ్యంగా రాజకీయేతర విషయంపై ఉభయ సభల్లోనూ తీవ్ర రగడ చోటు చేసుకుంది. అదే.. సంచార్ సాథీ ఫోన్ ‘యాప్’. దీనిపై పెద్ద ఎత్తున మంగళవారం ఉభయ సభల్లోనూ వివాదం చెలరేగింది.
దీంతో ప్రభుత్వం తొలుత ఎదురుదాడి చేసినా.. తర్వాత వివరణ ఇవ్వడంతోపాటు.. ఈ యాప్కు సంబంధించి ప్రకటించిన నిబంధనలను కూడా కేంద్రం సడలించింది. దీంతో ఈ వివాదం ఒకింత తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకునే వరకు తమ నిరసన ఆగబోదని విపక్షాలు స్పష్టం చేశాయి.
అసలేంటీ యాప్?
సంచార్ సాథీ అనేది భారత టెలికం రంగానికి చెందిన ప్రత్యేక యాప్. తరచుగా ఫోన్లు పోగొట్టుకునే వారికి.. ఈ యాప్ ప్రస్తుతం ఉపయుక్తంగా ఉంటోంది. దీనిద్వారా సదరు పోయిన ఫోన్ను ట్రాక్ చేయొచ్చు. డేటా లీక్ కాకుండా కూడా చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక, ఈ యాప్లో తాజాగా సైబర్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా జోడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ యాప్ ద్వారా.. అలెర్టు కావడంతోపాటు.. ఏఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి దేశంలో విక్రయించే అన్ని రకాల ఫోన్లలోనూ సంచార్ సాథీ యాప్ను డీఫాల్ట్గా ఉంచాలని కేంద్రం ఆదేశించింది. ఆ యాప్ను యూజర్ తొలగించేందుకు.. డిలీట్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా ఉండాలని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా సోమవారం రాత్రి ఉత్తర్వు లు జారీ చేసింది. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
ఈ యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత వివరాలను కేంద్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని.. దీనిపై ఆధిపత్యం ఎందుకంటూ.. విపక్షాలు ప్రశ్నించాయి. ఉభయ సభల్లోనూ ఈ విషయం వివాదంగా మారడంతో తాజాగా కేంద్రం దిగివచ్చింది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేయడం తప్పదని.. అయితే.. దీనిని కొనసాగించాలో.. వద్దో వినియోగదారుడి ఇష్టమని పేర్కొంది. ఇది పూర్తి వినియోగదారుల హక్కులను కాపాడేందుకు తీసుకువచ్చిన యాప్ అని కేంద్రం వివరించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates