జ‌న‌సేన‌-బీజేపీల ప్ర‌చారం షురూ.. టికెట్‌పై తేల్చ‌కుండానే!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం విష‌యంలో దూకుడుగా ఉన్న బీజేపీ-జ‌న‌సేన పార్టీలు అన‌ధికార ప్ర‌చారం మొద‌లు పెట్టేశాయి. పైకి తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ప్ర‌స్తావించ‌కుండానే.. ఈ రెండు పార్టీల నాయ‌కులు కూడా ప్ర‌చారం ప్రారంభించాయ‌నే చెప్పాలి. నివ‌ర్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ఓదార్చుతా నంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌చారం ప్రారంభించేశారు. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. కేవ‌లం తుఫాను బాధితుల‌ను ఓదార్చేందుకే అయితే.. ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల్లో స‌గం చాలు. కానీ, ఆయ‌న వ్యూహం అంతా తిరుప‌తిపైనే ఉండ‌డంతో ఆ దిశ‌గానే వ్యాఖ్య‌లు దూసుకువ‌స్తున్నాయి.

అసెంబ్లీలో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వివాదాన్ని సైతం ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. మ‌ద్యం ధ‌రల పెంపును ప్ర‌స్తావించారు. ఇంటి ప‌న్నులు పెంచుతూ తీర్మానం చేయ‌డంపైనా ఆరోప‌ణ‌లు గుప్పించారు. సీఎం గా జ‌గ‌న్ ఏం సాధిస్తున్నార‌ని.. ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో న‌ష్ట‌పోయిన రైతాంగానికి భారీ సాయం చేయాల‌ని కూడా ప్ర‌స్తావిస్తున్నారు. జోరు వ‌ర్షంలోనూ ప‌వ‌న్ గొడుగు ప‌ట్టుకుని చేస్తున్న ప్ర‌సంగాల వెనుక సంపితీని త‌ట్టి లేపుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. తిరుప‌తి ఉప పోరును దృష్టిలో పెట్టుకునే ప‌వ‌న్ ఇలా చేస్తున్నార‌ని చెబుతున్నారు.

ఇక‌, బీజేపీ విష‌యాన్ని తీసుకుంటే.. కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాల‌పై ఈ పార్టీ నేత‌లు ఫోక‌స్ చేశారు. నివ‌ర్ తుఫాన్ బాధితుల స‌మ‌స్య‌ను ప‌క్క‌న పెట్టి.. రోడ్లు, కాలువ‌లు.. అంటూ.. రోడ్డున ప‌డ్డారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.. మీరు ఒక్క‌సారి ఈ రోడ్ల‌పై న‌డిచి చూడండి! అంటూ.. సీఎం జ‌గ‌న్‌కు స‌వాలు రువ్వారు. ఇక‌, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి మ‌రింత‌గా రోడ్ల స‌మ‌స్య‌పై క‌దం తొక్కారు. ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తే.. వీరు కూడా తిరుప‌తి ఉప పోరును దృష్టిలో ఉంచుకునే ప్ర‌జ‌ల్లో క‌నిపించేందుకు తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. చిత్రం ఏంటంటే.. ఈ రెండు పార్టీలూ ఉమ్మ‌డిగానే ఇక్క‌డ పోటీ చేయాల‌ని నిర్ణ‌యించాయి. కానీ, టికెట్ విష‌యం ఇంకా ఏమీ తేల‌లేదు. ప్ర‌స్తుతం ఈ టికెట్ విష‌యంపై తేల్చేందుకు కేంద్ర బీజేపీ.. ఒక క‌మిటీ వేస్తాన‌ని చెప్పినా.. ఇంకా వేయ‌లేదు. తిరుప‌తి టికెట్ త‌మ‌కు కావాల‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప‌ట్టుదల‌తో ఉన్నారు. అందుకే తాను.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న‌ట్టు తాజాగా కూడా చెప్పుకొచ్చారు. అయితే.. బీజేపీ కూడా ఇదే ప‌ట్టుద‌ల‌తో ఉంది. త‌మ‌కే కావాల‌ని.. అంటోంది. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల మ‌ధ్య ఈ టికెట్ విష‌యం తేల‌కుండానే.. ఇరుప‌క్షాలు ఎవ‌రికి వారు తిరుప‌తి ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకుని.. అన‌ధికార ప్ర‌చార ప‌ర్వానికి తెర‌దీయడం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.