నేత‌లు తీరు.. బాబు ఆనందించిన క్ష‌ణాలు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి కార‌ణం.. వారు త‌న మాట వినిపించుకోవ‌డం లేద‌ని, తాను చెప్పిన‌ట్టు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కురావ‌డం లేద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. ముఖ్యంగా ప్ర‌తి నెలా 1వ తేదీన అమ‌లు చేస్తున్న ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ విష‌యంలో నాయ‌కులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా చెబుతున్నారు. కేవ‌లం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు వుతున్నార‌ని.. ఇది స‌రికాద‌ని, ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని వేదిక‌గా మ‌లుచుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు.

అయితే.. నాయ‌కులు మాత్రం త‌మ తీరును పెద్ద‌గా మార్చుకోవ‌డం లేదు. ఒక వేళ వ‌చ్చినా.. ఇలా పాల్గొని అలా వెళ్లిపోతున్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల్లో సంతృప్త స్థాయిలు పెర‌గ‌డం లేద‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్వ‌హించిన ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో వినూత్న విధానం తీసుకువ‌చ్చారు. పింఛ‌న్లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొనే నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో ఫొటోలు దిగి వాటిని పార్టీ కార్యాలయం వెబ్‌సైట్‌లో పోస్టు చేయాల‌ని ఆదేశించా రు. దీనికి టైంను కూడా కేటాయించారు. అంటే.. తొలుత కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ప్పుడు ఒక ఫొటో.. కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత‌.. మ‌రో ఫొటోను అప్‌లోడ్ చేయాల‌ని ఆదేశించారు.

ఫ‌లితంగా కార్య‌క్ర‌మం ముగిసే వ‌ర‌క కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు దీనిలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్క‌డా వారు త‌ప్పించుకునే అవ‌కాశం ఉండ‌దు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నిర్వ‌హించిన ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీలో 90 శాతం మంది నాయ‌కులు పాల్గొన్నారు. ఆ వెంట‌నే ఫొటోలు అప్‌లోడ్ చేశారు. అదేవిధంగా కార్య‌క్ర‌మాలు ముగిసిన త‌ర్వాత కూడా ఫొటోల‌ను అప్‌లోడ్ చేశారు. దీంతో సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యానికి పార్టీ కార్యాల‌యం ఎవ‌రెవ‌రు.. ఎక్క‌డెక్క‌డ‌.. ఎంతెంత సేపు ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారో.. నివేదిక‌ను రెడీ చేసింది.

అనంత‌రం ఈ నివేదిక‌ను.. సీఎం కార్యాల‌యానికి అందించింది. ఫ‌లితంగా 90 శాతం మంది నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్టు తెలుసుకున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నాయ‌కుల్లో మార్పు మ‌రింత రావాల్సి ఉంద‌ని.. 100 శాతం మంది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని ఆయ‌న చెప్పారు. ఎప్ప‌టిక‌ప్పుడు నాయ‌కుల ప‌నితీరును స‌మీక్షిస్తామని సీఎం చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. నాయ‌కులు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయితేనే వారి నుంచి మంచి ఫ‌లితం ఆశించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌జ‌ల మ‌ధ్య లేకుండా.. ఓట్లు ఎలా అడుగుతార‌ని కూడా ప్ర‌శ్నించారు.