‘క్రిక్ ఇన్ఫో’పై కోహ్లి అభిమానుల ఫైర్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎవరంటే మరో మాట లేకుండా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పేస్తారు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతడికి భారీగా అభిమానులున్నారు. సోషల్ మీడియాలో ఈ తరం ఉత్తమ క్రికెటర్ ఎవరు అనే పోల్ పెడితే.. కోహ్లీకే ఎక్కువ ఓట్లు పడుతుంటాయి.

ఐతే క్రికెట్ అభిమానుల ఫేవరెట్ వెబ్ సైట్ ‘క్రిక్ ఇన్ఫో’ పెట్టిన ఓ పోల్‌లో మాత్రం కోహ్లి వెనుకబడటం.. వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ విజేతగా నిలవడం విరాట్ అభిమానులకు నచ్చలేదు.

దీంతో ‘షేమ్ ఆన్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోల్ విషయంలో క్రిక్ ఇన్ఫో మానుపులేషన్ చేసిందని.. ఫలితాలు మార్చి తాము అనుకున్న ప్రకారం పోల్ ఫలితాల్ని ప్రకటించిందని కోహ్లి అభిమానులు ఆరోపిస్తున్నారు.

లాక్ డౌన్ టైంలో క్రికెట్ అభిమానుల్ని ఎంగేజ్ చేయడం కోసం ‘క్రిక్ ఇన్ఫో’ సోషల్ మీడియా ద్వారా రకరకాల పోల్స్, కాంటెస్టులు పెడుతోంది. ఇందులో భాగంగా ఫలానా ప్రమాణాలు అని చెప్పకుండా ‘విరాట్ కోహ్లి ఆర్ క్రిస్ గేల్’ అంటూ పోల్ పెట్టింది ఆ వెబ్ సైట్. లక్షా 30 వేల మంది దాకా ఈ పోల్ లో పాల్గొన్నారు.

ఐతే ఫలితాల ప్రకటనకు ‌కొంత సమయానికి ముందు ఈ పోల్‌లో 51 శాతం మంది కోహ్లికి ఓటేసినట్లు.. గేల్‌కు 49 శాతం ఓట్లు పడ్డట్లు చూపించింది క్రిక్ ఇన్ఫో. కానీ తర్వాత మాత్రం పోల్‌లో గేల్ గెలిచినట్లు ప్రకటించింది. దీంతో కోహ్లి అభిమానులకు మండిపోయింది. గేల్‌ను విజేతగా ప్రకటించాలని ముందే ఫిక్సయినపుడు ఇలా పోల్ పెట్టడం ఎందుకు అంటూ క్రిక్ ఇన్ఫో సైట్‌ మీద పడ్డారు. ‘షేమ్ ఆన్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో’ హ్యాష్ ట్యాగ్‌తో లక్షల మంది ట్వీట్లు వేసి.. ఆ సైట్‌ను తిట్టిపోస్తున్నారు.