టీడీపీలో నెలకొన్న వివాదాలకు అంతుదరి లేకుండా పోయిందన్నది వాస్తవం. ఎమ్మెల్యేలను కట్టడి చేసే బాధ్యతను మంత్రులకు, ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు అప్పగించారు. అయితే.. ఇది సాధ్యమేనా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. వాస్తవానికి ఇంచార్జ్ మంత్రుల మాటను కూడా ఎమ్మెల్యేలు పెద్దగా లక్ష్యం చేయడం లేదన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఇంచార్జ్ మంత్రులు వస్తున్నారంటేనే ఎమ్మెల్యేలు వారికి అందుబాటులో ఉండడం లేదు.
ఒకవేళ నియోజకవర్గంలోనే ఉన్నా.. ఆరోగ్య కారణాలు చూపించి సమావేశానికి డుమ్మా కొడుతున్నారు. ఇలా.. ఇంచార్జ్ మంత్రుల మాట కూడా.. నాయకులు వినిపించుకోవడం లేదు. ఈ విషయాన్ని సదరు మంత్రులు ఇటీవల మంత్రి నారా లోకేష్ దృష్టికితీసుకువెళ్లారు. “మేం ప్రయత్నం చేస్తున్నాం. కానీ, వారు మాట వినడం లేదు.“ అని తేల్చి చెప్పారు. దీనికి నారా లోకేష్ తనదైన శైలిలో మంత్రం వేశారు. ఎమ్మెల్యేలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత మంత్రులదేనని ఆయన కూడా తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో ఎవరైతే.. ఎమ్మెల్యేలు మాట వినడం లేదో వారి వివరాలను రహస్యంగా తన డ్యాష్ బోర్డుకు ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. వారి విషయాన్ని తాను చూసుకుంటానన్నారు. అంతేకాదు.. ఏయే విషయాల్లో ఎమ్మెల్యేలు వినిపించుకోవడం లేదు? ఎక్కడ దారి తప్పుతున్నారన్న విషయాన్ని స్పష్టంగా పాయింట్ల వారీగా చెప్పాలని సూచించారు. వాటికి సంబంధించి ఆధారాలను కూడా మంత్రులు ప్రొవైడ్ చేయాలని తెలిపారు.
అంతేకాదు.. మంత్రులు పర్యవేక్షిస్తున్న తీరును కూడా తనకు వివరించాలని సూచించారు. “మీరు ఏర్పాటు చేసే సమావేశానికి సంబంధించిన అజెండా.. ఎవరెవరిని ఆహ్వానించారు? ఎవరు రావడం లేదు. ఎందుకు రాలేదు.. వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.“ అని తేల్చి చెప్పారు. దీంతో మంత్రులకు కొంత ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఇప్పటి వరకు సూత్రం లేని గాలిపటంగా ఉన్న వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ ఫార్ములా ఉప యోగ పడుతుందని భావిస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు ఇకనైనా దారిలోకి వస్తారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates