ప్రతిపక్షం కోసం జగన్ ఉపయోగం లేని పోరాటం

వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మొండిపట్టు పట్టిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని హోదా కోసం జగన్ ఉపయోగం లేని పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని ఎంతమంది చెబుతున్నా జగన్ మాత్రం వినడం లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నారు. కానీ, 151 నుంచి 11 సీట్లకు పార్టీ పరపతి పడిపోయిన అవమానభారంతోనే జగన్ శాసన సభలో అడుగుపెట్టేందుకు ఇష్టపడడం లేదన్నది మరో వాదన.

తన హయాంలో 151 మంది బలం చూసుకొని శాసన సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మొదలు అచ్చెన్నాయుడు వరకు అందరినీ అవమానించి ఆనందించిన జగన్…అదే ట్రీట్మెంట్ తనకు జరగడం ఖాయమని భావించి సభకు వచ్చే సాహసం చేయడం లేదనన్నది టీడీపీ నేతల వాదన. ఈ క్రమంలోనే జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతాను అంటోన్న జగన్ ను ఉండవల్లి తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అసలెక్కడయినా విన్నామా ఇది అంటూ విస్మయం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచినట్లు అని ప్రశ్నించారు. ఒకవేళ అధికార పక్ష సభ్యుల తీరు నచ్చకుంటే అలగడం, సభ నుంచి వాకౌట్ చేయడం వంటివి సాధారణమని, కానీ, ఇలా సభకే హాజరు కాకుండా ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ప్రతిపక్ష హోదా లేకపోతే ఏంటని, అసలు హోదా వల్ల ఏమీ జరగదని అన్నారు. అపోజిషన్ లీడర్ కు ఒక పీఏ, ఒక ఆఫీసు, కేబినెట్ హోదా ఇస్తారని..అంతకుమించి పెద్దగా ఏమీ ఒరగదని తేల్చేశారు. మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రాని పరిస్థితులున్నాయని, అటువంటిది ప్రతిపక్ష నేత పిలిస్తే వస్తారా అని కుండబద్దలు కొట్టారు ఉండవల్లి. మరి, ఎల్లపుడూ తన మేలు కోరే ఉండవల్లి ఉచిత సలహాను జగన్ పాటిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తన తండ్రి వైఎస్ నమ్మిన నేత అయిన ఉండవల్లి మాట విని జగన్ శాసన సభ సమావేశాలకు హాజరవుతారా లేక ఎప్పటి లాగే సస్పెన్షన్ వేటు తప్పించుకునేందుకు 6 నెలలకొకసారి హాజరై మెరుపుతీగలా మాయమవుతారా అన్నది తేలాల్సి ఉంది.