వచ్చే ఎన్నికల నాటికి.. రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయా? బీజేపీ-జనసేన- టీడీపీ కూటమి మాదిరిగా మరో కూటమి ఆవిర్భవించే అవకాశం ఉందా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు పరిశీలకులు. చిన్నా చితకా పార్టీలను కలుపుకొని.. మరో మహాకూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఈ కూటమి విషయంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ వైపు కొన్ని పార్టీలు చూస్తున్నాయన్నది వాస్తవమని చెబుతున్నారు.
ప్రస్తుతం వైసీపీతో చేతులు కలిపేందుకు కాదు.. ఆయన చేతులు కలిపితే.. కౌగిలించుకునేందుకు నాలుగు పార్టీలు రెడీగా ఉన్నాయని.. జైభీం పార్టీ నాయకుడు.. జడ శ్రావణ్ కుమార్ చెప్పుకొచ్చారు. దీనిని కొంత లోతుగా పరిశీలిస్తే.. ఇది నిజమేనని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న కూటమికి ఆపోజిట్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జైభీం, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ స్థాపించి ఎస్సీల పార్టీతో పాటు కొన్ని చిన్నా చితకా పార్టీలు ఉన్నాయి.
వీటికి పెద్దగా బలంలేదని భావించవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో సామాజిక వర్గాల బలం ఈ పార్టీలకు ఉంది. కనీసంలో కనీసం.. 1000 – 2000 ఓట్లను ఈ పార్టీలు ప్రభావితం చేస్తున్నాయని. గత ఎన్నికల్లో ఒంటరి పోరు కు దిగిన ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, జైభీం పార్టీలు డిపాజిట్లు దక్కించుకోలేక పోయాయి. అయితే.. వెయ్యి నుంచి 1500 ఓట్లను ప్రభావితం చేశాయి. ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచిన చాలా మంది నాయకులు.. వెయ్యి ఓట్లలోపు వచ్చాయి. ఇప్పుడు వీరంతా ఏకతాటిపైకి వస్తే.. అప్పుడు.. వైసీపీకి మరింత బలం పుంజుకుంటుందని.. తాను ఈ కార్యక్రమానికి నడుం బిగిస్తానని జడ చెప్పుకొచ్చారు.
ఇక, కమ్యూనిస్టులు అయితే.. వైసీపీ వైపు.. గత కొంత కాలం నుంచి చూస్తూనే ఉన్నారు. అయితే.. ఇంతకీ అసలు వైసీపీ ఉద్దేశం ఏంటి? అనేది చూస్తే.. కూటమి తప్పుకాకపోయినా.. దీనికి జగన్ విముఖంగా ఉన్నా రు. ఎందుకంటే.. గత ఎన్నికలకు ముందు కూడా బీజేపీ నేతలు.. వైసీపీతో పొత్తుకు ప్రయత్నించారన్న వాదన వినిపించింది. అయితే.. మైనారిటీ ఓటు బ్యాంకు నేపథ్యంలో జగన్ దీనికి ససేమిరా అన్నారని కూడా వార్తలు వచ్చాయి. సో.. ఇప్పుడున్న పరిస్థితిలో పొత్తు పెట్టుకుంటే.. మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నా.. దీనికి వైసీపీ అధినేత ఏమేరకు చేతులు చాపుతారన్నదే కీలకం. మరి చూడాలి ఏం జరుగుతుందో..!
Gulte Telugu Telugu Political and Movie News Updates