ఏపీ సీఎం చంద్రబాబు అన్నమాట నిలబెట్టుకున్నారు. శనివారం రాత్రి ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లలో కొన్నింటికి అప్పటికప్పుడు హామీ ఇచ్చారు. వీటిలో ప్రధానంగా కరువు భత్యం(డీఏ) తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేస్తూ.. తాజాగా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కారు దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం.. డీఏను పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం చొప్పున డీఏను పెంచుతున్నట్టు తెలిపింది. ఇది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 33.67 శాతం డీఏ జనవరి నుంచి 37.31 శాతానికి పెరగనుంది. ఈ పెంచిన మొత్తాన్ని జనవరి నెల వేతనం నుంచి ఉద్యోగులకు అందించనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన మాటను కూడా సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లకు నోచుకోకపోవడంపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. శనివారం సీఎం చంద్రబాబుతో చర్చించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి.. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా దీపావళిని పురస్కరించుకు ని సోమవారం దీనికి సంబంధించిన జీవోను కూడా సర్కారు విడుదల చేసింది. వీరికి కూడా జనవరి నుంచి పదోన్నతులు కల్పించనున్నట్టు సర్కారు తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates