మైండ్ లేనేళ్లో అలా మాట్లాడ‌తారు!: లోకేష్‌

రాష్ట్రంలో ఒక్క‌చోట‌కే పెట్టుబడులు తీసుకువ‌స్తున్నార‌ని.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల‌న్నీ.. నిర్ల‌క్ష్యానికి గురి అవుతున్నాయంటూ.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు మైండ్ లేనోళ్లే.. అలా మాట్లాడ‌తార‌ని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతానికి మాత్ర‌మే త‌మ అభివృద్ధి ప‌రిమితం కాద‌న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ పెట్టుబ‌డులు స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. అదేస‌మ‌యంలో ఉపాధి, ఉద్యోగాల‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు.

ఒకే రాజ‌ధానిని అభివృధ్ది చేస్తున్నామ‌న్న నారా లోకేష్‌.. అదేస‌మ‌యంలో అభివృద్ధిని అన్ని ప్రాంతాల‌కు వికేంద్రీక‌రిస్తున్న‌ట్టు చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాల‌కు పంప్డ్‌‌ స్టోరేజ్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీలు వస్తున్నాయని తెలిపారు. వీటి వ‌ల్ల‌స్థానికంగా 20 నుంచి 30 శాతం మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని చెప్పారు. అదేవిధంగా… చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎకో సిస్టమ్ ఏర్పాటు కానుంద‌న్నారు. త‌ద్వారా.. ఆయా ప్రాంతాలు కూడా జాతీయ‌స్థాయిలో గుర్తింపు పొందుతాయ‌ని తెలిపారు.

“ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబ‌డులు తీసుకుంస్తోంది. అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్ ఏర్పాటు కానుంది. త‌ద్వారా ప్ర‌పంచ ఖ్యాతికి రాష్ట్రం చేరువ అవుతుంది. రెండు గోదావరి జిల్లాల్లో ఆక్వా ప‌రిశ్ర‌మ‌లు రానున్నాయి. విశాఖ‌లో గూగుల్‌తో పాటు టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌ వంటి సంస్థలు వ‌స్తున్నాయి. ” అని లోకేష్ వివ‌రించారు. రాష్ట్రం.. దేశంలోనే అత్యుత్తమ ప‌నితీరు క‌న‌బ‌రుస్తోందన్నారు. దీనిని చూసి కొంద‌రు ఓర్వ‌లేక‌.. ప‌నిలేని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఆ హామీ నెర‌వేరుతుంది!
రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న హామీ నెరవేరుస్తామ‌ని మంత్రి లోకేష్ చెప్పారు. తాము కేవ‌లం ఒప్పందాల‌కే ప‌రిమితం కావ‌డం లేద‌ని.. ఆయా సంస్థ‌లు ఏర్పాటు అయ్యే వ‌ర‌కు వెంట‌బ‌డుతున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఐదు ల‌క్ష‌ల మందికి ఐటీలో ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు తెలిపారు. “అన్ని రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు ఉన్నాయి.. ఏపీలో మాత్రం డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ఉంది” అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.