నో అప్పాయింట్‌మెంట్‌: ఐదు రోజులు బాబు బిజీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేని పరిస్థితిలో ఉన్నార‌ని ముఖ్య‌మంత్రికార్యాల‌య వ‌ర్గాలు తెలిపాయి. తాజాగా ప‌లువురు ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు రాగా.. నో అప్పాయింట్ మెంట్‌ అంటూ అధికారులు తేల్చి చెప్పారు. వాస్త‌వానికి సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు పునః ప్రారంభం అవుతున్నాయి. అయితే.. స‌భ‌లో ఆయ‌న పాల్గొన‌ర‌ని కూడా అధికారులు తేల్చి చెప్పారు. ఈ నెల 22 నుంచి విశాఖ‌లో జ‌రిగే గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు హాజ‌రు కానున్న‌ట్టు వివ‌రించారు.

ఈ స‌ద‌స్సు రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నుంద‌ని.. దీంతో సీఎం చంద్ర‌బాబు అక్క‌డే ఉంటార‌ని, వ్యాపార వాణిజ్య వేత్త‌ల‌ను క‌లుసుకుంటార‌ని అధికారులు వివ‌రించారు. అనంత‌రం… 24న ఉద‌యం రాజ‌ధానికి చేరుకుని.. ఆరోజు అసెంబ్లీకి హాజ‌రవుతార‌ని చెప్పారు. అనంత‌రం.. అదే రోజు సాయంత్రం తిరుమల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రై శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు.

దీంతో ఈ మూడు రోజులు కూడా చంద్ర‌బాబు ఎవ‌రినీ క‌లుసుకోర‌ని అధికారులు వివ‌రించారు. అనంత రం.. ఈ నెల 27న బాప‌ట్ల జిల్లాలోని సూర్యలంక స‌ముద్ర తీరంలో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలో ప్రారంభం కానున్న బీచ్ ఉత్సవాల్లో చంద్ర‌బాబు పాల్గొననున్నట్టు వివ‌రించారు. అయితే.. అదే రోజు ఉద‌యం స‌భ‌కు హాజ‌రై.. ప్ర‌సంగిస్తార‌ని, ఈ స‌మ‌యంలోనూ ఎవ‌రికీ అప్పాయింట్‌మెంటు లేద‌ని పేర్కొన్నారు.

ఆ మ‌రుస‌టి రోజు.. అంటే.. ఈ నెల 29న ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నార‌ని.. దీంతో ఆ రోజు కూడా సీఎం చంద్రబాబు బిజీబిజీగానే ఉండ‌నున్నార‌ని అధికారులు వివ‌రించారు. దూర ప్రాంతాల నుంచి సీఎంను క‌లుసుకునేందుకు వ‌చ్చే సాధార‌ణ ప్ర‌జ‌లు.. ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని.. సూచించారు. కాగా.. ఈ రేంజ్‌లో వ‌రుస‌గా చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంట్లు క్యాన్సిల్ చేసుకోవ‌డం ఇదే తొలిసార‌ని అధికారులు వెల్ల‌డించారు.