ఏపీ స‌భా ప‌ర్వం: వైసీపీ దెబ్బ‌తో ప్ర‌జారోగ్యం నాశ‌న‌మైంది!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజు శుక్ర‌వారం ప‌లు అంశాల‌పై స‌భ్యులు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆసుప‌త్రులు నిలిపివేయడంపై ప‌లువురు స‌భ్యులు ప్ర‌శ్నించారు. దీనిపై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ను వారు ప్ర‌శ్నించగా ఆయన స్పందిస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రోగులకు సేవలు మరింత మెరుగుపడ్డాయని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో 2023-24లో 12,53,065 మంది రోగులు చికిత్స పొందగా, కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25లో 13,42,673 మంది రోగులు చికిత్స పొందారని వివరించారు.

అయితే వైసీపీ దెబ్బ‌తో ప్ర‌జారోగ్యం నాశ‌న‌మైంద‌ని అన్నారు. వారి హ‌యాంలోనే ఆసుప‌త్రుల‌కు చెల్లించాల్సిన సొమ్ములు బ‌కాయిలుగా పెట్టారని, దీంతో పేద‌ల వైద్యం దెబ్బతిందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయినట్లు జరుగుతున్న అసత్య ప్రచారంలో వాస్తవం ఏమీ లేదన్నారు. రోగులు బాధపడుతుంటే, మరణాలు జరిగినా రాజకీయ లాభం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీపై మండిప‌డ్డారు. గత ప్రభుత్వం రోగులకు సేవలు అందించడంలో అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పేరు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందన్నారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన బకాయిలను చెల్లిస్తున్నామ‌న్నారు. గత ప్రభుత్వం నెట్‌వ‌ర్క్ ఆసుపత్రులకు ఆపిన రూ.2,222 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఇంకా రూ.557.83 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రూ.2,168 కోట్లకు సంబంధించిన బిల్లులు పరిశీలన దశలో ఉన్నాయని మంత్రి స‌త్య‌కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వాసుపత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రూ.457.45 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఇంకా రూ.110.21 కోట్లు చెల్లించాల్సి ఉందని, వాటిని త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని సభకు వివరించారు. దీనిపై ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ప్ర‌భుత్వం పేద‌ల ప‌ట్ల బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం కేంద్రం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ ప‌థకాన్ని కూడా రాష్ట్రంలో అమ‌లు చేయడానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు వివరించారు.