వైసీపీ కీల‌క నాయ‌కురాలి ‘సైడ్ విజ‌న్‌.. !’

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అవకాశం వస్తుందో.. ఎవరు ఎటువైపు మారుతారో అనేది చెప్పడం కష్టం. ‘అవసరం-అవకాశం’ అనే రెండు పట్టాలపై ప్రయాణం చేసే రాజకీయ నాయకులు.. తమ అవసరానికి తగిన విధంగా రాజకీయాలను మార్చుకోవడం అనేది పార్టీలు మారడం అనేది తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి చెందిన ఎం ఎల్ సి ఒకరు టిడిపికి టచ్ లోకి వెళ్లారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో వైసీపీ తరఫున బలమైన గ‌ళం వినిపిస్తున్న ఆ మహిళా నాయకురాలు పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం పైన, కూటమి నాయకుల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు గుప్పించారు.

అదేవిధంగా వైసీపీ చేసిన కార్యక్రమాలు, గతంలో అమలు చేసిన పథకాలను కూడా ఆమె పలు సందర్భాల్లో మీడియా ముందు, అదే విధంగా శాసన మండలి లో కూడా బలమైన వాయిస్ వినిపించారు. ఒకరకంగా చెప్పాలంటే సదరు నాయకురాలికి చెక్‌ పెట్టడం ఎలా? అనే విషయంపై కూటమి ప్రభుత్వం అంతర్మ‌థ‌నం కూడా చెందిన విషయం గ‌మ‌నార్హం. ఇది ఒకానొక దశలో చర్చకు దారి తీసింది. సదరు మహిళ వైసిపి నాయకురాలికి అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం మరో యువ మహిళా నాయకురాలిని రంగంలోకి దింపింది.

అయితే అనూహ్యంగా ప్రస్తుతం పరిణామాలు మారిపోయాయి అన్నది వైసీపీలోనే జరుగుతున్న చర్చ. తాజాగా తిరుపతి వేదికగా జరిగిన మహిళ జాతీయ సాధికార సదస్సులో వైసీపీ తరఫున ఎవరినీ పాల్గొనవద్దని పార్టీ అధిష్టానం సూచించింది. దీనికి కొన్ని రీజన్లు కూడా చెప్పింది. దీంతో చాలామంది దీన్ని బాయ్‌ కట్ చేశారు. వాస్తవానికి శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అలాంటిది సదరు మహిళా నాయకురాలు ఈ కార్యక్రమానికి రావడం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. టిడిపి నాయకులతో కలిసి భోజనాలు చేయడం.. వారితో కలిసి విహరించటం అనేటటువంటిది రాజకీయంగా చర్చ‌కు వచ్చింది. దీంతో ఆమె తన పంథాను మార్చుకున్నారని తన దారిని మార్చుకున్నారు అనేది వైసిపిలో జరుగుతున్న చర్చ. మరి కొద్ది రోజుల్లోనే శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైసీపీలో జరుగుతున్న ఈ మార్పు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాలి. ఇక‌, టీడీపీ కూడా వైసీపీలో బ‌లంగా మాట్లాడే వారి విష‌యం యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు నాయ‌కురాలు త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.