యువ‌త‌కు పెద్ద‌పీట‌.. రూల్స్ ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు యువ‌త‌కు పెద్ద పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటు పార్టీలోను.. అటు ప్ర‌భుత్వంలోనూ కూడా.. ఆయ‌న యువ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంత్రుల‌ను చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా కూడా అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇది రాజ‌కీయ కోణం. ఇక‌, పాల‌నా యంత్రాంగం ప‌రంగా కూడా.. చంద్ర‌బాబు తాజాగా తీసుకున్న నిర్ణ‌యంపై ఉన్న‌తాధికారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రూల్స్‌ను కొంత మేర‌కు ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు ట్రైనీ అధికారులుగా ఉన్న ఐఏఎస్‌ల‌కు క‌లెక్ట‌ర్లుగా జిల్లాల బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని అంటున్నారు.

తాజాగా 12 మంది క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేయ‌డంతోపాటు.. మ‌రో న‌లుగురు కొత్త‌వారికి జిల్లాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వీరిలో నిషాంత్ కుమార్, ⁠డాక్టర్ సిరి, ⁠ప్రభాకర్ రెడ్డి, ⁠రాజా బాబు ఉన్నారు. వాస్త‌వానికి వీరు ట్రైనీ క‌లెక్ట‌ర్లుగా ఉన్నారు. అనంత‌రం.. వీరిని డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా నియ‌మించాలి. ఆ త‌ర్వాత‌.. సంయుక్త క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి క‌ల్పించిన త‌ర్వాత‌.. మ‌రో ఐదారేళ్ల‌కు కానీ.. వారిని పూర్తిస్థాయిలో క‌లెక్ట‌ర్లుగా నియ‌మించే అవ‌కాశం లేదు. కానీ, మొత్తం 15 మంది శిక్ష‌ణ‌లో ఉన్న ఐఏఎస్ లు ఉండ‌గా.. పైన‌లుగురికి మాత్రం నేరుగా క‌లెక్ట‌ర్లుగా అవ‌కాశం క‌ల్పించారు.

రీజ‌నేంటి?

ప్ర‌స్తుతం శిక్ష‌ణ‌లో ఉన్న క‌లెక్ట‌ర్ల‌కు ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు ఆర్టీజీఎస్ స‌హా.. ఐవీఆర్ ఎస్ వంటి సేవ‌ల‌ను అప్పగించారు. వీటిలో ప్ర‌తిభ చూపిన వారిని.. అదేవిధంగా గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన వారిని ప్ర‌త్యేకంగా గుర్తించారు. వీరిలో నిషాంత్ కుమార్, ⁠డాక్టర్ సిరి, ⁠ప్రభాకర్ రెడ్డి, ⁠రాజా బాబు చంద్ర‌బాబు మార్కుకు త‌గిన విధంగా స‌క్సెస్ అయ్యారు. దీంతో వారిని నేరుగా క‌లెక్ట‌ర్లుగా జిల్లాల‌కు పంపించారు. అయితే.. దీనికి కేంద్ర ప్ర‌భుత్వ రూల్స్ ఒప్పుకొంటాయా? అంటే.. ఉత్త‌మ ప్ర‌తిభ చూపిన‌ట్టు స‌ర్కారు ఆమోదం తెలిపి.. కేంద్రానికి పంపితే.. సాధ్య‌మే. తాజాగా చంద్ర‌బాబు అదే చేసిన‌ట్టు ఉన్న‌తాధికారులు తెలిపారు.

దిశానిర్దేశం..

చంద్ర‌బాబు కొత్త క‌లెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. సీఎం అంటేనే కామ‌న్ మ్యాన్‌(సాధార‌ణ పౌరుడు)గా భావిస్తున్న ప్ర‌భుత్వ‌మ‌ని.. కాబ‌ట్టి క‌లెక్ట‌ర్లు కూడా.. అదేవిధంగా ప్ర‌జ‌లకు చేరువ కావాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ అధికారంతో కాకుండా.. సేవా దృక్ఫ‌థంతో ప‌నిచేయాల‌ని పేర్కొన్నారు. ఒక్కొక్క‌సారి రూల్స్ అడ్డం వ‌చ్చినా.. పేద‌ల స్థితి గ‌తులు, అర్హులు.. ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగాల‌ని చంద్ర‌బాబు సూచించారు.